బాలుడి ఫోన్ పగలగొట్టిన ఉదంతంపై స్పందించిన అనసూయ

Update: 2018-02-06 12:36 GMT

జబర్దస్త్ యాంకర్ అనసూయపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అనసూయ తన కుమారుడి ఫోన్‌ పగలగొట్టి, దూర్భాషలాడిందని బాధిత బాలుడి తల్లి ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్‌‌స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇచ్చింది. తార్నాక విజయపురికాలనీకి జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ రావడంతో ఫొటో తీస్తుండగా ఫోన్‌ లాక్కుని పగలగొట్టిందని ఫిర్యాదుచేసిన మహిళ అనసూయపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. యాంకర్‌ అనసూయ ఏదో పని నిమిత్తం తార్నాక విజయపురికాలనీకి వచ్చింది. తన తల్లితో కలిసి అటుగా వెళ్తోన్న బాలుడు రోడ్డుపక్కన అనసూయ కనిపించగానే అభిమానంతో ఆమెతో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే తీవ్ర కోపోద్రిక్తురాలైన అనసూయ పిల్లాడి చేతిలో నుంచి సెల్‌ఫోన్‌ లాక్కుని నేలకేసి కొట్టింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ బాలుడి తల్లి అనసూయతో వాగ్వాదానికి దిగి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది.

అయితే ఈ పరిణామంపై తాజాగా అనసూయ స్పందించింది.‘ఈ రోజు ఉదయం తార్నాకలో నివసించే మా అమ్మగారి వద్దకు వెళ్లాను. ఇంటి నుంచి బయటికి రాగానే ఆ మహిళ, అబ్బాయి మొబైల్‌లో వీడియో తీస్తున్నారు. నా దగ్గరికి వచ్చి సెల్ఫీ అడిగారు. కానీ ఆ సమయంలో సెల్ఫీ దిగేందుకు సిద్దంగా లేకపోవడంతో తిరస్కరించాను. అయినా వారు వినిపించుకోకుండా నన్ను విసిగించారు. నేను నా ముఖాన్ని దాచుకుంటూ  నా కారులో కూర్చున్నా. ఆ సమయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. దురదృష్టవశాత్తు ఆ మహిళ ఫోన్‌ పగిలిపోయింది. కానీ ఆ మహిళ అసత్య వార్తలను ప్రచారం చేస్తుంది’  అని తెలిపారు. మొబైల్‌ పగిలినందుకు క్షమాపణలు తెలుపుతున్నానని, కానీ నాపై నిందలు వేయడం పద్దతి కాదన్నారు. తనకి కూడా వ్యక్తిగత స్వేచ్చ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. సెలబ్రిటీలు కూడా సాటి మనషులేననే విషయం మరిచిపోతున్నామన్నారు. వారికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని, అది మరిచిపోయి కొంత మంది ఎందుకు ప్రతి విషయాన్ని పెద్దది చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక తన కుమారుడి ఫోన్‌ పగలగొట్టిందని, దుర్భాషలాడిందని బాధిత బాలుడి తల్లి ఉస్మానియా యూనివర్శిటీ  పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Similar News