ప్రముఖ యాంకర్, నటి అనసూయకు కొంతకాలంగా అసభ్యకరమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయట. భారతదేశంలో ఓ మహిళకున్న స్వేచ్ఛ ఇదేనా? అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. భారతదేశంలో మహిళలకు ఎలాంటి భద్రత, గౌరవం లేదంటూ ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టారు.
‘ప్రియమైన భారతదేశం.. నా కుటుంబాన్ని ఆనందంగా ఉంచడానికి కుమార్తెగా, సోదరిగా, మహిళగా, భార్యగా, కోడలిగా, తల్లిగా అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాను. నేను చేసే పని, వేసుకునే దుస్తులు నా కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. అయితే పక్కవాళ్లు వీటిని వేలెత్తి చూపుతున్నారు. నా కుటుంబాన్ని, నన్ను అగౌరవపరిచే హక్కు వారికి ఎక్కడ ఉంది? ప్రతి రోజూ అసభ్యకరమైన ఫోన్ కాల్స్, సోషల్మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఓ బాధ్యతగల మహిళగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నాకు నచ్చిన పనిని స్వేచ్ఛగా చేయలేకపోతున్నాను. స్వేచ్ఛ అంటే ఇదేనా? కొందరు వ్యక్తులు సంస్కృతి, సంప్రదాయం పేరుతో నా ఆశల్ని అణచి వేయాలనుకుంటున్నారు. ఇవన్నీ అనుభవిస్తూ బతకాలా? ఈ విషయంలో మనం ఏమీ చేయలేమా?’ అని అనసూయ ట్విటర్లో పోస్ట్ పెట్టారు. గతంలోనూ ట్విటర్లో తన గురించి అసభ్యకర కామెంట్లు, పోస్ట్లు పెడుతున్నారని అలాంటివారిని బ్లాక్ చేయాలనుకుంటున్నానని అనసూయ తెలిపారు.
#HappyRepublicDay ??????♀️ pic.twitter.com/cMQm4PTzHX
— Anasuya Bharadwaj (@anusuyakhasba) January 26, 2018