కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదల్లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కూడు, గూడు లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఇది చూసిన ఎంతోమంది సినీ ప్రముఖులు మేమున్నాం అంటూ ముందుకొచ్చి ఆర్ధిక సాయం ప్రకటించారు. కాగా ‘మహానటి’ సినిమాతో భారీ సక్సెస్ని అందుకున్న మళయాలీ భామ కీర్తీ సురేష్ కేరళ బాధితులకు భారీ సాయాన్ని అందజేసింది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కి రూ.10 లక్షలు, ట్రాన్స్పోర్ట్, బట్టలు, నిత్యావసర వస్తువులు, మందుల కోసం మరో రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించింది.
అయితే తన సొంత రాష్ట్రామైన కేరళ ఇబ్బందుల్లో ఉండటంతో కీర్తీ బాధితులకు సాయం చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగింది. త్రివేండ్రంలోని ఓ కళాశాల నుంచి కీర్తీ బాధితులకు అవసరమైన వస్తువులను సరఫరా చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోలను తన ఫేస్బుక్ ఖాతా ద్వారా పంచుకుంటుంది. అంతేకాక.. బాధితులకు ఏయే వస్తువులు కావాలో లైవ్ వీడియోల ద్వారా అభిమానుల్ని కోరుతుంది. దీంతో కీర్తీ చేస్తున్న ఈ గొప్ప పనుల్ని, ఆమె గొప్ప మనస్సును మొచ్చుకుంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.