తెలుగు సినీ పరిశ్రమలో మహానటి సావిత్రి తర్వాత గొప్పనటిగా సీనియర్ నటి జమున పేరు తెచ్చుకున్నారు. ‘పుట్టిల్లు’ సినిమాతో చిత్ర సీమలో అడుగుపెట్టి.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రత్యేకంగా ‘సత్యభామ’ పాత్రలో ఆమె అభినయం ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. స్టార్ హీరోలతో సమానంగా అభిమానులను సంపాదించుకోవడం మాత్రమే కాదు.. ఓ దశలో వారితో పోటీ పడ్డారు కూడా. ఈమె దూకుడు సహించలేక ఓ దశలో ఎన్టీయార్, ఏఎన్నార్ జమునను సినీ పరిశ్రమ నుంచి బహిష్కరిద్దామనుకున్నారట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో జమున వెల్లడించారు. అమె మాటల్లో
నిజం చెబుతా! కొంచెం వివాదాస్పదం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లలో ఒకరికి నా బిహేవియర్ నచ్చలేదట. ‘ఏంటి? కాలు మీద కాలేసుకుంటుంది’, ‘టైమ్కు రాదు’ అని ఒకరు... ‘మోస్ట్ ట్రబుల్సమ్ క్యారెక్టర్’ అని ఇంకొకరు అనుకున్నారు. ‘ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలంటే.. మనమిద్దరం (ఎన్టీఆర్-ఏఎన్ఆర్) కలిసి తనని సినిమాల నుంచి బహిష్కరించాలి’అని భావించారట. సరే చేసుకోండి, నా సినిమాలు నాకు ఉన్నాయి. ఎక్కడున్నా అదే పద్ధతి. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అలా మూడేళ్లు పోటాపోటీగా నిలిచా. వాళ్లిద్దరి సినిమాలతో సమానంగా నా చిత్రాలను డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు. గెలుపోటములు వాళ్లకీ, నాకూ ఉన్నాయి. చివరికి ‘గుండమ్మ కథ’ చేశా. నాగిరెడ్డిగారు.. చక్రపాణిగారు పిలిచి సంధి చేశారు. ‘నేనేం తప్పు చేయలేదు.. కాలుమీద కాలేసుకోవడం నా అలవాటు’ అని చెప్పా. మా ముగ్గురిని కలిపింది మా గుండమ్మ సూర్యకాంతమ్మ.