ఏపీ శాసనసభలో సీఎం జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన టీడీపీ విషయంలో దేవుడు అద్భుతమైన స్క్రిప్ట్ రాశాడని అన్నారు. దేవుడు రాసిన స్క్రిప్ట్ ఎంత గొప్పగా ఉంటుందనడానికి, జరిగిన ఎన్నికలే నిదర్శనమన్నారు జగన్. ఎమ్మెల్యేలను కొన్న వారికి 23సీట్లు ఎంపీలను కొన్ని వారికి మూడు ఎంపీ సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు జగన్. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చూసేందుకు కొందరు ఎమ్మెల్యేలను లాగేద్దామని పార్టీ నేతలు కొందరు చెబితే తాను అంగీకరించలేదన్నారు జగన్. చంద్రబాబు నాయుడికి 23మంది ఎమ్మెల్యేలున్నారు. ఐదుగురిని లాగేస్తే ప్రతిపక్ష హోదా ఉండదన్నారు. ఆ పార్టీలో నుంచి ఎవరినైనా తీసుకుంటే వారిని కచ్చితంగా రాజీనామా చేయించిన తర్వాతే తీసుకుంటామని చెప్పారు జగన్.
కొత్త స్పీకర్గా ఎన్నికైన తమ్మినేని సీతారాంకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఇదే శాసన సభలో విలువల్లేని రాజకీయాలు చూశామన్నారు జగన్. ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వని రాజకీయాలు చేశామన్నారు. తాను కూడా అలాగే చేస్తే మంచి అనేది ఎక్కడా కనిపించదన్నారు. చట్టసభలపై అవగాహన ఉన్న వ్యక్తిని స్పీకర్గా ఎంపిక చేశామని జగన్ స్పష్టం చేశారు.