గోదావరి ఉగ్రరూపంతో ఉభయగోదావరి జిల్లాలు విలవిల

Update: 2019-08-02 01:47 GMT

గోదావరి ఉగ్రరూపంతో ఉభయగోదావరి జిల్లాలు వణికిపోతున్నాయి. గ్రామాలకు గ్రామాలే నీట మునగడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందంటోన్న అధికారులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. గోదావరి ఉగ్రరూపంతో ఉభయగోదావరి జిల్లాల్లో ఏజెన్సీ గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. గ్రామాలకు గ్రామాలే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాజ్ వేలు, రహదారులపై ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. మరోవైపు పోలవరానికి ప్రమాదకర స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో స్పిల్‌వే గేట్లను తాకుతూ నీరు ప్రవహిస్తోంది.

పోలవరం ప్రాజెక్టు క్యాఫర్ డ్యామ్ కారణంగా ముంపు గ్రామాల్లో మోకాల్లోతు నీరు చుట్టుముట్టింది. దాంతో ఏజెన్సీలో రాకపోకలు నిలిచిపోయి గిరిజనులు అల్లాడిపోతున్నారు. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో వరద పరిస్థితిని మంత్రులు ఆళ్ల నాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, తానేటి వనిత సమీక్షించారు. వందలాది గ్రామాలు నీట మునగడంతో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దాంతో రెస్క్యూ టీమ్స్‌ బాధితులను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Tags:    

Similar News