ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్.. విపత్తు వస్తే సగం ఏపీ కొట్టుకుపోతుంది : రాజేంద్ర సింగ్
శ్రీశైలం డ్యామ్ నిర్వహణ అధ్వాన్నంగా ఉందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ అన్నారు. డ్యాంకు వెంటనే మరమ్మతులు చేయకపోతే పెనుప్రమాదం తప్పదన్నారు.
శ్రీశైలం డ్యామ్ నిర్వహణ అధ్వాన్నంగా ఉందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ అన్నారు. డ్యాంకు వెంటనే మరమ్మతులు చేయకపోతే పెనుప్రమాదం తప్పదన్నారు. 'గంగాజల్ సాక్షరత్' యాత్రలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ఆయన హైదరాబాద్కు వచ్చారు. మంగళవారం శ్రీశైలం డ్యామ్ను సందర్శించారు. డ్యామ్ నిర్వహణకు 600 మంది సిబ్బంది అవసరమని, కానీ 100 మంది మాత్రమే పనిచేస్తున్నారని చెప్పారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను రాజేంద్ర సింగ్ కలిశారు. నదుల ప్రక్షాళన, పరిరక్షణతోపాటు మాతృభాషపైనా వారి మధ్య చర్చ జరిగింది. శ్రీశైలం డ్యామ్లో తీవ్ర హైడ్రోలిక్ ఒత్తిడి వల్ల నీటి వేగం అధికంగా ఉంటుందని, దీంతో డ్యాం కోతకు గురయ్యే ప్రమాదం ఉందని వివరించారు. గత ప్రభుత్వాలు ఇంత పెద్ద పాజ్రెక్టులు కడితే కనీసం నిర్వహణ కూడా చేపట్టకపోవడం బాధాకరమని అన్నారు.
ఈ ప్రాజెక్టుకు ఏదైనా విపత్తు సంభవిస్తే సగం ఆంధ్రప్రదేశ్ కొట్టుకుపోతుందని, దీనిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. నల్లమల యురేనియం మైనింగ్తో కృష్ణా నది కాలుష్యం అవుతుందని, దీని ప్రభావం ప్రజలతో పాటు జంతువులపైనా పడుతుందని, జీవ వైవిధ్యం దెబ్బతింటుందని వివరించారు. ఈ నేపథ్యంలో నల్లమలలో మైనింగ్ చేపట్టకూడదని ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.