ఈజీగా డబ్బు సంపాదించాలన్న దుర్బుద్దితో ఇరికించపోయి ఇరుక్కున్నాడు ముంబైకి చెందిన సుందర్ పాల్. తాను తిన్న ఆహారం బల్లి పడిందని నాటకమాడి డబ్బు వసూలు చేయబోయాడు కానీ అసలు విషయం బయట పడటంతో అడ్డంగా దొరికిపోయాడు ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్లో జరిగింది.
రైల్వేల్లో, స్టేషన్ల లో అందించే ఆహారంపై ప్రజల్లో పెద్దగా నమ్మకం లేదు నాణ్యత ఉండదని భావిస్తారు తరచు ఆహారంలో బొద్దింకలు బల్లులు వంటివి వచ్చిన ఘటనలు ఉన్నాయి. దీన్నే ఆసరా చేసుకున్న ఓ వ్యక్తికి కొత్త ఆలోచన వచ్చింది. రైల్వే క్యాటరింగ్ సిబ్బందిని బోల్తా కొట్టించి ఈజీగా మనీ సంపాదించాలనుకున్నాడు ముంబైకి చెందిన సుందర్ పాల్.
గుంతకల్లు రైల్వే స్టేషన్ క్యాటరింగ్ స్టాల్లో వెజ్ బిర్యానీ తీసుకుని అక్కడే తిన్నాడు సుందర్ పాల్. బల్లిని పోలిన ఓ చేపను వెంట తెచ్చుకున్నాడు. చేపలో సగం ముక్కను వెజ్ బిర్యానీలో వేసి నాటకానికి తెర లేపాడు వెజ్ బిర్యానీలో బల్లి వచ్చిందని అది తినడం వల్లే అస్వస్థతకు గురయ్యాయని నాటకాన్ని రక్తికట్టించాడు. హడావుడి పడిన క్యాటరింగ్ నిర్వాహకులు అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. బిర్యానీలో బల్లి వచ్చిన విషయాన్ని రచ్చ రచ్చ చేస్తానని బెదిరించాడు ఏమి చేయాలో తెలియని నిర్వాహకులు అతనికి 5వేలు ముట్టజెప్పారు. ఫిర్యాదును వాపస్ తీసుకునేలా రాజీ కుదుర్చుకున్నారు.
అయితే ఈనెల 14న ఇలాంటి ఘటనే జబల్పూర్ రైల్వే స్టేషన్లో జరిగినట్లు గుర్తించారు. అక్కడ సమోసాలో బల్లి వచ్చిందని చెప్పి ఓ వ్యక్తి 50వేలు వసూలు చేసినట్లు తెలిసింది. అంతే అక్కడి నుంచి నిందితుడి ఫొటో తెప్పించారు ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి సుందర్ పాల్ ఒక్కరేనని గుర్తించారు. రైల్వే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిజాన్ని ఒప్పుకున్నాడు సుందర్ పాల్. సుందర్ పాల్పై కేసు నమోదు చేసి కోర్టుకు పంపనున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.