హత్యకు పక్కా ప్లాన్ వేశారు.. అనుకునట్లుగానే టార్గెట్ను ఫినిష్ చేశారు.. ఎవరికీ అనుమానం రాకుండా.. ఆధారాలు లేకుండా చేశారు.. ఈ స్టోరీ వింటుంటే దృశ్యం సినిమా గుర్తొస్తుంది కదూ.. అచ్చు ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ లో జరిగింది.. అయితే పోలీసుల వ్యవహారంలో నిజం బయట పడింది.. దృశ్యం సినిమా తరహాలోనే రాంప్రసాద్ హత్యకు కోగంటి సత్యం స్కెచ్ వేసినట్లు హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అనుమానిస్తునట్లు సమాచారం.. హత్య జరిగిన సమయంలో తాను తిరుపతిలో ఉన్నానంటూ కోగంటి విడుదల చేసిన వీడియోలు పథకం ప్రకారం చిత్రీకరించినవేనని అనుమానిస్తున్నారట.. రాంప్రసాద్ను హతమార్చి, నేరాన్ని శ్యామ్ ఖాతాలో వేయడం వారి పథకంలో భాగమేనని భావిస్తున్నారు.
ఈ హత్యలో ఆయన ప్రమేయంపై పోలీసులు లోతుగా ఆరా తీశారు. పోలీసులకు దొరకొద్దనే ఉద్దేశంతో కోగంటి తెలివిగా వేర్వేరు సిమ్కార్డులతో వ్యవహారాన్ని నడిపినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి రాంప్రసాద్ హత్య జరిగిన సమయంలో తాను తిరుపతిలోని ఓ సత్రంలో ఉన్నానని కోగంటి పేర్కొన్నాడు. అదే విషయాన్ని తన అనుచరులతో మీడియాకు చెప్పించాడు. ఆ సత్రంలోని వేంకటేశ్వర స్వామి విగ్రహం వద్ద కూర్చుని, వైఎస్ గురించి మాట్లాడుతున్న ఓ వీడి యో క్లిప్ను విలేకరులకు అందే లా చేశాడు. అయితే పోలీసుల టెక్నాలజీ ముందు బోల్తా పడ్డాడు. వేర్వేరు సిమ్కార్డులు వాడినా.. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా కోగంటి శనివారం రాత్రి పంజాగుట్టలోని నాగార్జునహిల్స్లోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రాంప్రసాద్ హత్యకు ముందు రెండు-మూడు నెలలుగా నిందితులంతా పంజాగుట్టలో ఓ ఫ్లాట్ను అద్దెకు తీసుకుని, రెక్కీ నిర్వహించారని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. రాంప్రసాద్, కోగంటి మధ్య ఆర్థిక వివాదాలే ఈ హత్యకు కారణమని నిర్ధారించే పలు కీలక ఆధారాలను సేకరించారు సమాచారం. మొత్తం 13 మందికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించగా.. కోగంటితో సహా 8 మందిని అరెస్టు చేశారు. మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు.