దేశంలోనే మొదటిసారిగా..విశాఖ రైల్వేస్టేషన్లో కొత్త తరహా డిజిటల్ సేవలు!
-మొదటిసారిగా హ్యూమన్ ఇంటరాక్టివ్ ఇంటర్ఫేస్ సర్వీస్ -ఒకటో నెంబర్ ఫ్లాట్ ఫామ్పై అందుబాటులోకి సేవలు
మీరు ట్రైన్ జర్నీ చేస్తున్నారా? మీ ట్రైన్ ఎక్కడుందో... ఎప్పుడొస్తుందోనని టెన్షన్ పడుతున్నారా? మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందా? ఇకపై ఆ చింతే అవసరం లేదు... ఎందుకంటే, రైల్వేస్టేషన్లలో స్పీడ్ ఛార్జింగ్తోపాటు... మీ ట్రైన్ ఎక్కడుందో... ఎప్పుడొస్తుందో... మీరే స్వయంగా తెలుసుకోవచ్చు... ప్రస్తుతం విశాఖ రైల్వేస్టేషన్లో ప్రారంభమైన కొత్త తరహా డిజిటల్ సేవలు త్వరలో... అన్ని చోట్లా అందుబాటులోకి రానున్నాయి.
విశాఖ రైల్వేస్టేషన్లో దేశంలోనే మొదటిసారిగా హ్యూమన్ ఇంటరాక్టివ్ ఇంటర్ఫేస్ సర్వీస్ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. హాయ్ పేరుతో పిలిచే ఈ స్మార్ట్ డిజిటల్ కియోస్కో బిల్ బోర్డును ఒకటో నెంబర్ ఫ్లాట్ ఫామ్పై అందుబాటులోకి తెచ్చారు. ఒడిషాకి చెందిన నెక్సైటీ స్టార్టప్ కంపెనీ దీన్ని రూపొందించింది. రైల్వే స్టేషన్లో ప్రయాణికుడు పొందాల్సిన అన్ని సౌకర్యాలూ ఈ హాయ్ ద్వారా పొందవచ్చు.
ఒక్కో హాయ్ కియోస్కోలో 50 ఇంచుల ఎల్ఈడీ స్క్రీన్లు వెర్టికల్ మోడ్లో ఉంటాయి. ముందు-వెనుక భాగాల్లో రెండు స్క్రీన్లతోపాటు 6 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. రెండు మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్... రెండు యూఎస్బీ పోర్టులు... అలాగే త్రీపిన్ ప్లగ్ను అమర్చారు. మొబైల్స్ కేవలం పది పదిహేను నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ అయ్యేలా సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చారు. ఇక, హాయ్ కియోస్కో ద్వారా రైళ్ల రాకపోకలు... ట్రైన్ రన్నింగ్ స్టేటస్ తెలుసుకోవడంతోపాటు ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాదు, గూగుల్ మ్యాప్, సిటీ మ్యాప్లు కూడా ఈ హాయ్ కియోస్కోలో అందుబాటులో ఉంచారు. అయితే, ఈ డిజిటల్ వ్యవస్థను ఎవరూ దుర్వినియోగం చేయకుండా... చుట్టూ 33 సీసీ కెమెరాలతోపాటు ప్రతి ఒక్కరి ముఖం స్కాన్ అయ్యేలా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఎవరైనా ముఖానికి ఏదైనా అడ్డుపెట్టుకుంటే... ఇక్కడ్నుంచి ఫ్రీ కాల్స్ చేసుకునే సౌకర్యం పొందలేరని రైల్వే అధికారులు అంటున్నారు.
ఈ హాయ్ కియోస్కోతో ప్రయాణికులకు సమాచారం అందించడంతోపాటు ప్రకటనలు కూడా ప్రదర్శించే అవకాశముండటంతో ఆదాయం కూడా వస్తుందని రైల్వే అధికారులు అంటున్నారు. ఇక, ప్రయాణికులైతే... ఈ హాయ్ కియోస్కో తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందంటూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు.