కర్నూలు జిల్లాలో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన కలెక్టర్ వీరపాండ్యన్కు విచిత్ర అనుభవం ఎదురైంది. నిన్న రాత్రి 11 గంటల సమయంలో కలెక్టర్ పాణ్యం గిరిజన వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్కు వెళ్లిన సమయంలో.. గేటుకు తాళం వేసి ఉంది. ఎన్నిసార్లు పిలిచినా ఎవరూ పట్టించుకోలేదు. సుమారు అరగంట సేపు కలెక్టర్ రోడ్డుపైనే నిలుచున్నారు. ఇక చేసేది లేక.. కలెక్టర్ వెంటవున్న సిబ్బంది గోడ దూకి లోపలికి వెళ్లి.. తాళాలు పగులగొట్టారు.
లోపలకు వెళ్లిన కలెక్టర్కు అక్కడ మరో తాళం కనిపించింది. విద్యార్థులు ఉండే గదులకు కూడా తాళాలు వేసి ఉన్నాయి. దీంతో విద్యార్థులను పిలిచి .. తాళం తీయాలని కలెక్టర్ తెలిపారు. అయితే తాళం తమ వద్ద లేదని, వాచ్మెన్ వద్ద ఉందని.. అతడు కూడా లేడని విద్యార్థులు సమాధానమిచ్చారు. దీంతో ఆ తాళాన్ని కూడా పగులగొట్టి లోపలికి వెళాల్సి వచ్చింది.
తాళాలు పగుల గొట్టుకుంటు లోపలికి వెళ్లిన కలెక్టర్ అక్కడ పరిస్థితులు చూసి.. షాక్ తిన్నారు. విద్యార్థులు తరగతి గదుల్లోనే బెంచీలపై కొందరు.. కింద కొంతమంది పడుకున్నారు. కనీసం దుప్పట్లు కూడా లేవు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. దీంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం సంబంధిత అధికారులు కర్నూలుకు రావాలని ఆదేశించారు.