విద్యుత్ కొనుగోళ్ల సమీక్షకు హైలెవల్ కమిటీ..అవినీతిని నిగ్గుతేల్చాలని సీఎం జగన్ ఆదేశం
విద్యుత్ ఒప్పందాలపై సీరియస్గా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పీపీఏల్లో అక్రమాలను నిగ్గుతేల్చేందుకే హైలెవల్ కమిటీ అపాయింట్ చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తోన్న జగన్ ప్రభుత్వం సోలార్ అండ్ విండ్ పవర్ అగ్రిమెంట్స్ను రివ్యూ చేయనుంది. ప్రతి ఒప్పందాన్ని నిశితంగా పరిశీలించనున్న ఉన్నతస్థాయి కమిటీ పీపీఏల్లో అవినీతిని వెలికి తీయనుంది.
మాజీ ముఖ్యమంత్రి అయినా మాజీ మంత్రి అయినా సరే అవినీతి జరిగిందని తేలితే చర్యలు తీసుకోవాల్సిందేనంటోన్న సీఎం జగన్మోహన్రెడ్డి విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు ట్రాన్స్కో సీఎండీ కన్వీనర్గా 9మంది సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని అపాయింట్ చేశారు. ఈ హైలెవల్ కమిటీలో మంత్రులు బుగ్గన, బాలినేనితోపాటు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, సీఎం చీఫ్ అడ్వైజర్ అజయ్ కల్లం, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్, ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్, సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ, ఏపీఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ గోపాల్రెడ్డి, ఏపీ ట్రాన్స్కో జేఎండీ సభ్యులుగా ఉంటారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలపై ఈ కమిటీ దర్యాప్తు చేయనుంది. ముఖ్యంగా సోలార్, విండ్ విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గుర్తించడంతో ఆయా ఒప్పందాలను రివ్యూ చేయనున్నారు. అలాగే ప్రభుత్వ విద్యుత్ సంస్థల నుంచి తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్నా ఎందుకు అధిక రేటుకు కొనుగోలు చేశారో తేల్చనున్నారు.
విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలతో ప్రభుత్వ ఖజానాకు 2వేల 636 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆ డబ్బును ఆయా సంస్థల నుంచి రికవరీ చేయాలని ఆదేశించారు. ఒకవేళ ఆయా కంపెనీలు దారికి రాకుంటే ఒప్పందాలను సైతం రద్దు చేసుకోవాలని సూచించారు. అంతేకాదు ఈ వ్యవహారంలో ఎంతటివారున్నా వదిలిపెట్టొద్దని న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించడం సంచలనంగా మారింది.