ఐపీఎల్ మహిళల టీ20 ఛాలెంజ్లో లీగ్ దశ ముగిసింది. వెలాసిటీతో జరిగిన మూడో మ్యాచ్లో హర్మన్ప్రీత్ సారథ్యంలోని సూపర్నోవాస్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫైనల్కు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్ ధాటిగా ఆడి ప్రత్యర్థి ముందు 143 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. యువ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (77) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. చమరీ ఆటపట్టు (31) రాణించింది.
ఛేదనకు దిగిన వెలాసిటీకి శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 7 వద్ద షెఫాలీ వర్మ (2), 21 వద్ద హేలీ మాథ్యూస్ ఔటయ్యారు. ఈక్రమంలో మిథాలీ రాజ్ (40) సహకారంతో డేనియెల్ వ్యాట్ (43) అద్భుతంగా ఆడి జట్టును విజయం వైపు నడిపించింది. కీలక సమయంలో ఆమెను పూనమ్ యాదవ్ క్లీన్బౌల్డ్ చేసింది. అప్పుడు స్కోరు 77. ఆ తర్వాత మిథాలీ, వేద కృష్ణమూర్తి (30; 29 బంతుల్లో 3×4) వేగంగా ఆడకపోవడంతో చేయాల్సిన రన్రేట్ పెరిగింది. చివరి ఓవర్లో 23 పరుగులు చేయాల్సి ఉండగా 10 పరుగులే చేసి 130/3కు పరిమితమయ్యారు.
ఫైనల్లో మళ్లీ వెలాసిటీ, సూపర్నోవాస్ జట్లే తలపడనున్నాయి. తొలి మ్యాచ్లో స్మృతి మంధాన నేతృత్వంలోని ట్రయల్ బ్లేజర్ గెలిచినా రెండో మ్యాచ్లో ఘోరంగా ఓడిపోవడంతో రన్రేట్ తగ్గింది. అవకాశాలు చేజారాయి.