మహేంద్ర సింగ్ ధోనీ .. ఐపీఎల్.. చెన్నై సూపర్ కింగ్స్ ఈ మూడింటిని వేరు చేసి చూడటం చాలా కష్టం. ఐపీఎల్ విజయవంతం అవడంలో అటు ముంబయి పాత్ర ఎంత ఉందో దానితో సమానంగా.. ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువగానే చెన్నై ప్రభావం ఉందనేది వాస్తవం. అదే విధంగా భారత క్రికెట్ లో కొన్నేళ్లుగా మహీ ఎంత బలమైన ముద్ర వేశాడో చెప్పనక్కర్లేదు. మిస్టర్ కూల్ గా అభిమానుల మనస్సుల్లో ముద్ర వేసుకున్న ధోనీ వచ్చే వరల్డ్ కప్ తరువాత రిటైర్ అవుతాడని ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు. దీంతో ఆదివారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచు కూడా ధోనికి చివరి ఐపీఎల్ అవుతుందని అందరూ భావిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం బాగానే వైరల్ అవుతోంది. ధోనీ చివరి మ్యాచు గెలవలేక వెనుతిరిగారు అనే అర్థం వచ్చేలా ఫొటోలతో పోస్ట్ లు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో తను వచ్చే ఐపీఎల్ లో ఆడుతాడా.. లేదా అన్న సస్పెన్స్ కు తానె తెర దించే ప్రయత్నం చేశాడు ధోనీ. 'దేశం కోసం 2019 ప్రపంచకప్ గెలవడానికి కృషి చేయడమే నా బాధ్యత. చెన్నై జట్టు తరఫున ఈ సీజన్లోనూ మంచి క్రికెట్ ఆడాం. జట్టులో కొన్ని లోపాలున్నాయి. వాటిని సరిచేసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అన్నీ సహకరిస్తే మళ్లీ వచ్చే ఐపీఎల్ ఆడతానని అనుకుంటున్నాను' అని ధోనీ పేర్కొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ను అన్ని విభాగాల్లోనూ ముందుండి నడిపిస్తున్న ధోనీ గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ సీజన్లో రెండు మ్యాచ్ల్లో డ్రెస్సింగ్రూమ్కే పరిమితం అయ్యాడు. ఈ సీజన్లో రెచ్చిపోయి ఆడిన ధోనీ రానున్న ప్రపంచకప్లో భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో ధోనీ 15 మ్యాచుల్లో 83.20సగటుతో 416 పరుగులు చేశాడు.