కెప్టెన్ గా భారత జట్టును మరో స్థాయికి తీసుకెళ్లిన డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ. భారత క్రికెట్ లో దిగ్గజాలకు సాధ్యం కాని అద్భుతాలు కూల్ గా సాధించాడీ మిస్టర్ కూల్. భారత్కు టీ20 ప్రపంచకప్.. వన్డే ప్రపంచకప్.. చాంపియన్స్ ట్రోఫీలను అందించడంతో పాటు జట్టును అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్గా నిలిపిన ఘనత ధోనిది. ధోనీ అంటే.. ఓ విజయవంతమైన కెప్టెన్ గా అందరికీ గబుక్కున గుర్తుకు వస్తుంది. అయితే, ధోనీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. ఎన్నిసార్లు తలుచుకున్నా ఎప్పటికీ కొత్తగా అనిపించే ఆ సంగతులు ఇవే!
1. ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్ను వైట్వాష్ చేసిన ఏకైక కెప్టెన్(2016 మూడు టీ20ల సిరీస్ను ధోని సారథ్యంలోని టీమిండియా క్లీన్స్వీప్ చేసింది)
2. కెప్టెన్గా 150 టీ20 మ్యాచ్లకు(టీ20 లీగ్లతో సహా) విజయాన్ని అందించిన తొలి క్రికెటర్
3. వన్డే ఫార్మాట్లో తొమ్మిదిసార్లు సిక్సర్తోనే ఫినిషింగ్ టచ్ ఇచ్చిన ఏకైక క్రికెటర్
4. టీ20ల్లో ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్న మొదటి సారథి
5. క్రికెట్ చరిత్రలో వేలంలో అత్యధిక ధరకు అమ్ముడపోయిన బ్యాట్ ధోని వాడినదే( 2011 వరల్డ్కప్ ఫైనల్లో ధోని సిక్స్తో విన్నింగ్ షాట్ కొట్టిన బ్యాట్). ఆ బ్యాట్ను లక్ష యూరోలకు( రూ. 76లక్షలకు పైగా) ఆర్కే గ్లోబల్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్(భారత్) దక్కించుకుంది. 2011 వరల్డ్కప్ను ధోని సారథ్యంలో భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచి కప్ను సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్లో ధోని అజేయంగా 91 పరుగులు సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఫలితంగా 28 ఏళ్ల తర్వాత భారత జట్టు వన్డే వరల్డ్కప్ను ముద్దాడింది.