పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పన్నిన కుట్రలో 40 మంది భారతీయ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.. అమరాజవానుల కుటుంబాలకు టీమిండియా క్రికెటర్లు ఇప్పటికే ఒక మ్యాచ్ ఫీజు మొత్తాన్ని అందజేశారు.. తాజాగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కూడా తమ సొంతగడ్డపై జరిగే తొలి మ్యాచ్లో టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అమరాజవాన్ల కుటుంబాలకు అందజేయనున్నట్టు తెలిపింది.
ఈ మొత్తాన్ని చెక్ రూపంలో చెన్నై కెప్టెన్ ధోని చేతుల మీదుగా అదేరోజు అందజేస్తారని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 23న చెన్నైలో జరిగే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్తో సీఎస్కే తలపడుతుంది. ధోని, కోహ్లి జట్ల మ్యాచ్ కావడంతో టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.