దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో భాగమైన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన సినిమా 'యాత్ర' ఈ నెల 8న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగాను నిర్మాతలకు సంతృప్తినిచ్చింది. వైయస్ఆర్ సతీమణి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఈ చిత్రాన్ని సోమవారం తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... యాత్ర సినిమాను చాలా బాగా తీశారు. కోట్లాది హృదయాల్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను 'యాత్ర' ద్వారా దర్శక, నిర్మాతలు తట్టిలేపారు. వైఎస్సార్ సజీవంగా మనముందు లేకపోయినా... యాత్ర చిత్రం ద్వారా ఆయనను మరోసారి మనముందుకు తీసుకువచ్చారని విజయమ్మ అన్నారు. ఈ చిత్రంలోని నటీనటులకు, దర్శక నిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా విజయమ్మ పాత్రను అశ్రిత వేముగంటి పోషించిన సంగతి తెలిసిందే. అంతకుముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా యాత్ర టీమ్కు అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే.. త్వరలోనే 'యాత్ర' చూస్తానని జగన్ చెప్పారు.