తమిళనాట సినిమా సంఘం ఎన్నికలు వేడెక్కుతున్నాయి. గత ఎన్నికల్లో విజయం సాధించిన నటుడు విశాల్ బృందం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. స్థల వివాదాలు, పలువురు నటీనటులతో విబేధాలు ఇప్పడు విశాల్ బృందానికి వ్యతిరేకంగా మారినట్టు చెబుతున్నారు. అంతే కాకుండా పలువురు నటులు ఇప్పటికే విశాల్ పై బహిరంగంగా తమ వ్యతిరేకతను వెల్లడించారు. తాజాగా నటి రాధికా శరత్ కుమార్ కూడా విశాల్ పై విరుచుకుపడ్డారు. మొదట్నుంచీ వారిద్దరి మధ్య విబేధాలున్నాయి. ఇపుడు మరోసారి రాధిక విశాల్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా అతనికి వ్యతిరేకంగా ఎవరు నిలబడినా తమ మద్దతు వారికే నని ప్రకటించారు. వివరాలిలా ఉన్నాయి.
నటుడు విశాల్ మంచివాడు కాదని అందరికీ తెలిసిపోయిందని నటి రాధికా శరత్కుమార్ వ్యాఖ్యానించారు. విశాల్ బృందానికి ఓటమి తప్పదన్నారు. 2015లో జరిగిన దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో అప్పటి సంఘ అధ్యక్షుడు శరత్కుమార్కు పోటీగా విశాల్ బరిలోకి దిగి విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఆ తరువాత విశాల్ బృందం శరత్కుమార్, రాధారవిలు నడిగర్ సంఘంలో పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సంఘానికి చెందిన సెంగల్పట్టులోని స్థలాన్ని అమ్ముకున్నారనే కేసు ఇప్పటికీ కోర్టు విచారణలో ఉంది. దీంతో నటి రాధిక శరత్కుమార్ అప్పట్లో విశాల్పై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల త్వరలో జరగనున్న నేపథ్యంలో విశాల్ బృందం మళ్లీ పోటీకి సిద్ధం అవుతోంది.
ఈ నేపథ్యంలో వారికి పోటీగా రాధికా శరత్కుమార్ ఎన్నికల బరిలో ఢీ కొనడానికి రెడీ అవుతున్నట్టు, సామాజిక మాధ్యమాలతో పాటు కొన్ని టీవీ ఛానెళ్లలోనూ తీవ్ర ప్రచారం జరుగుతోంది. కాగా ఈ విషయం గురించి స్పందించిన రాధికా శరత్కుమార్ తాను గానీ, తన భర్త శరత్కుమార్ గానీ నడిగర్ సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసే ఆలోచన గానీ, ఆసక్తిగానీ లేదన్నారు. తమకు అంత సమయం లేదని వ్యాఖ్యానించారు. అయితే నటుడు విశాల్ మంచి వాడు కాదన్న విషయం అందరికీ తెలిసిందని అన్నారు. అందుకు తమకు సంతోషంగా ఉందన్నారు. తాను గత 7వ తేదీనే షూటింగ్ నిమిత్తం కేరళాకు వెళ్లినట్లు తెలిపారు. కాగా తన సోదరుడు పోటీ చేస్తున్నాడా? అనే విషయాన్ని తనకు తెలియదన్నారు. అయితే ఎన్నికల్లో విశాల్కు వ్యతిరేకంగా ఎవరైనా పోటీ చేస్తే వారికి తమ మద్దతు ఉంటుందని రాధికా శరత్కుమార్ వెల్లడించారు.