సినీ కార్మికులకి అండగా నిలిచిన జగ్గు భాయ్!
కరోనా లాంటి విపత్కరమైన సమయంలో నష్టపోయిన రంగాలలో సినీ పరిశ్రమ ఒకటి..
కరోనా లాంటి విపత్కరమైన సమయంలో నష్టపోయిన రంగాలలో సినీ పరిశ్రమ ఒకటి.. షూటింగ్ లు కూడా వాయిదా పడడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అలాంటి వారికి బాసటగా నిలవాలని టాలీవుడ్ లోని మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) అనే ఏర్పాటైంది. ఈ ఛారిటీ ద్వారా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. మరోవైపు కొందరు ప్రముఖులు కూడా సినీ కార్మికులకి తమ వంతు సాయం చేస్తున్నారు.
అందులో భాగంగానే సినీ నటుడు జగపతి బాబు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్ డౌన్ సందర్భంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక , సినిమా నిర్మాణపు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న సినిమా రంగంలోని మహిళలకు ,లైట్ మన్ లకు ఈరోజు జగపతి బాబు నిత్యావసర సరుకులు , మాస్క్ లను పంపిణీ చేశారు. దాదాపుగా 400 మంది సినిమా కార్మికులకు బియ్యం , పప్పులు ,నూనె తదితర వస్తువులు జగపతి బాబు అందించారు . ఈ కార్యక్రంలో ప్రొడక్షన్ మేనేజర్ , భారతీయ జనతా పార్టీ నాయకుడు చంద్ర మధు జగపతి బాబు మేనేజర్ మహేష్ , సహాయకుడు రవి పాల్గొన్నారు .
అంతకుముందు కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ని పకడ్భందీగా నిర్వహిస్తున్న పోలీసులకి జగపతి బాబు ఎన్–95 మాస్కులు, శానిటైజర్లను అందించిన విషయం తెలిసిందే. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో సీపీ వి.సి.సజ్జనార్ను కలిసి వాటిని అందించారు.
ఇక టాలీవుడ్ లో హీరోగా ఓ వెలుగువేలిగిన జగపతిబాబు తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ పాత్రలు వేస్తూ టాలీవుడ్ కి మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిపోయారు.. లెజెండ్, అరవింద సమేత వీర రాఘవ, నాన్నకు ప్రేమతో రంగస్థలం సినిమాలు ఆయనకి విలన్ గా మంచి పాత్రలు తీసుకువచ్చాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళీ భాషల్లో ఫుల్ బిజీగా ఉన్నారు.