రజినీకాంత్ వర్సెస్ అజిత్...తమిళనాట బడా హీరోల మధ్య సినీ వార్
అభిమానం హద్దులు దాటితే హీరోపై ఉన్న ఇష్టం ఇంకాస్త ఎక్కువైతే ఇతర కథానాయకుల కంటే తమ అభిమాన నాయకుడే గొప్పోడనుకుంటే అంతే ఫ్యాన్స్ మధ్య ఫైటింగే. సరిగ్గా తమిళనాట అదే జరిగింది.
అభిమానం హద్దులు దాటితే హీరోపై ఉన్న ఇష్టం ఇంకాస్త ఎక్కువైతే ఇతర కథానాయకుల కంటే తమ అభిమాన నాయకుడే గొప్పోడనుకుంటే అంతే ఫ్యాన్స్ మధ్య ఫైటింగే. సరిగ్గా తమిళనాట అదే జరిగింది. సంక్రాంతి పూట ఇద్దరు బడా హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. పండుగ చేసుకోవాల్సిన ఫ్యాన్స్ కత్తులు దూసుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ స్క్రీన్ మీద చూపించాల్సిన యాక్షన్ సీన్ను రియల్గా చూపించారు.
కోలీవుడ్లో కొత్త వార్ మొదలైంది. సంక్రాంతి బరిలో ఉన్న సూపర్స్టార్ రజినీకాంత్ పేట, తళ అజిత్ కుమార్ విశ్వాసం సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. దీంతో తమిళచిత్ర సీమకు సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. అభిమానులు హంగామా చేసుకుంటున్నారు. పాలాభిషేకాలు, హీరోల పాటలపై స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరైతే నాలుకపై కర్పూరాన్ని వెలిగించి హారతులు పట్టారు.
అయితే ఈ సినిమాలు రెండూ తమిళనాడులో చాలాచోట్ల పక్క పక్క థియేటర్లలో ఆడుతున్నాయి. మొదటిరోజు తొలి షో చూడాలని ఫ్యాన్స్ పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అయితే అక్కడే గొడవ స్టార్ట్ అయ్యింది. వేలూరులోని ఓ థియేటర్లో రజినీకాంత్ ఫ్లెక్సీలు చింపేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.
రెండు వర్గాల మధ్య దాడులు మొదలయ్యాయి. తమ హీరోనే గొప్ప అంటూ నినాదాలు చేస్తూ ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. కొందరు కత్తులతో దాడి చేశారు. ప్యత్యర్థులను ఇష్టానుసారం పొడిచారు. దీంతో ఈ ఘటనలో నలుగురు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. తీవ్ర గాయాలపాలైన నలుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటు రంగంలోకి దిగిన పోలీసులు అల్లరిమూకలను చెదరగొట్టారు.
ఈ ఘటనకు బాధ్యులుగా చెప్పబడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు వేలూరుతో పాటు చెన్నై, మధురై, కోయంబత్తూర్లోని అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు థియేటర్ల దగ్గర ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. అభిమానం పేరుతో అలజడులు సృష్టిస్తే ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరించారు.