''ముంబైలో మాఫియా ఒకలా, విజయవాడలో మరోలా ఉంటుంది. ప్రతి ఊరిలో ఒక్కోటి ఒక్కోలా ఉంటుంది. అది ఎలా ఉంటుందన్నది 'పలాస'లో కొత్తగా ఉంటుంది'' అని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఆయన సమర్పణలో బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై అప్పారావు బెల్లన, అట్లూరి వరప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'పలాస 1978'. 'లండన్ బాబులు' ఫేం రక్షిత్ హీరో! ఈ సినిమా ఫస్ట్లుక్ను మంగళవారం విడుదల చేశారు. యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ గాయకుడు రఘు కుంచె ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ– ''ఒకప్పుడు ప్రతిదర్శకుడు ఒక్కో జానర్లో సినిమాలు తీసేవారు. కానీ ఇప్పుడు అందరూ ఒకే జానర్లో సినిమాలు తీస్తున్నారు. 'కేరాఫ్ కంచరపాలెం' లుక్లో కొత్త సబ్జెక్ట్తో తీసిన 'పలాస' ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది'' అన్నారు.
''ఫస్ట్ లుక్ పోస్టర్, హీరో లుక్ బాగున్నాయి. తమ్మారెడ్డిగారు ఇలాంటి సినిమాలకు అండగా నిలబడటం హ్యాపీ'' అన్నారు దర్శకుడు మారుతి. ''తెలుగు కథ వైజాగ్ దాటి ముందుకుపోలేదు. పలాస ప్రాంతం నేపథ్యంలో రాసుకున్న ఈ కథను ప్రసాద్, తమ్మారెడ్డిలకు చెప్పాను. వాళ్లు ముందుకు రావడంతోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలుగుతున్నాను. 40 యేళ్లపాటు సాగే కథను 40 రోజుల్లో తీయడం మా టీమ్ సహకారం వల్లే సాధ్యం అయింది'' అన్నారు కరుణకుమార్. ''ఇందులో క్రూరమైన పాత్ర చేశాను'' అన్నారు చిత్ర సంగీతదర్శకుడు రఘు కుంచె. ''రెండు నెలల పాటు పలాసలో షూటింగ్ చేశాం. 'గాంగ్స్ ఆఫ్ వస్సీపూర్' లాంటి సినిమాను ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం'' అన్నారు రక్షిత్. నక్షత్ర, రచయిత నాగేంద్ర, కెమెరామెన్ విన్సెంట్ అరుల్, వెంకట సిద్ధారెడ్డి, సహ నిర్మాత: ఎ.ఆర్ బెల్లన్న కార్యక్రమంలో పాల్గొన్నారు.