ప్రిన్స్ మహేశ్బాబు 'మహర్షి' సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లు (గ్రాస్) రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. తొలి వారాంతంలో రూ.100 కోట్ల మార్క్ను క్రాస్ చేయడం విశేషమని పేర్కొన్నారు. మహేశ్ సినీ కెరీర్లో ఇది మైలురాయి కాబోతోందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఈ సినిమా నైజాంలో నాన్-'బాహుబలి' రికార్డును సృష్టించిందని ఇప్పటికే విశ్లేషకులు తెలిపారు. ఈ సినిమా నాలుగో రోజున నైజాంలో రూ.3.46 కోట్లు రాబట్టిందట. తొలి వారాంతంలో నైజాంలో రూ.16 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా చెన్నైలోనూ సినిమా విశేషమైన కలెక్షన్స్ సాధిస్తోంది. 'మహర్షి' సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చారు. దిల్రాజు, ప్రసాద్ వి పొట్లూరి, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మించారు. మే 9న విడుదలైన ఈ సినిమాకు ప్రశంసలు లభించాయి. రైతులు, వ్యవసాయం విలువ తెలిసేలా ఓ మంచి సందేశం ఇచ్చారని మెచ్చుకున్నారు. అంతేకాదు సినిమాలోని 'వీకెండ్ వ్యవసాయం' ఇప్పుడు నిజంగా సోషల్మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా విజయం పట్ల పూజ ఆనందం వ్యక్తం చేశారు. సంతోషంతో చిందులేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ''మహర్షి'పై మీరు చూపించిన ప్రేమ నాతో డ్యాన్స్ చేయిస్తోంది. ఇది మరిచిపోలేని విజయం. బాక్సాఫీసు వద్ద సినిమా దూసుకుపోతోంది. అందరికీ ధన్యవాదాలు అని ఆమె ట్వీట్ చేసింది.