సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్లో భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న భారతీయుడు-2 సినిమా షూటింగ్లో ఘోర ప్రమాదం సంభవించింది. షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు భారీ క్రేన్ విరిగిపడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో డైరెక్టర్ శంకర్ కూడా ఉన్నారు. శంకర్ కాలు బోన్ ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో శంకర్తో పాటు గాయపడ్డవారికి చెన్నైలోని సవిత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చెన్నై సమీపంలోని పూందమల్లి దగ్గర్లోని ఈవీపీ స్టూడియోలో ఇండియన్ టూ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇందుకోసం భారీ సెట్లు వేస్తున్నారు. ఈ క్రమంలో 150 అడుగుల ఎత్తు ఉన్న క్రేన్ కింద పడటంతో.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుల్లో శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు, అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ, సహాయకుడు చంద్రన్ ఉన్నారు. గాయపడ్డవారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
మరోవైపు సెట్స్లో జరిగిన ప్రమాదంపై.. హీరో కమల్హాసన్ ట్విటర్లో స్పందించారు. ఘటన తనని కలిచివేసిందని.. ముగ్గురు సహాయకులను కోల్పోవడం బాధాకరం అని అన్నారు. తన బాధ కన్నా.. వారిని కోల్పోయిన కుటుంబాల బాధ ఎన్నో రెట్లు ఎక్కువ అంటూ ట్వీట్ లో తన ఆవేదనను పేర్కొన్నారు. మృతుల కుంటుబాలకు సానుభూతి తెలిపారు.
భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీలో కమల్హాసన్, సిద్ధార్థ, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాష్కరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.