దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం ఆధారంగా యాత్ర అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మహి వీ రాఘవ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా సినిమా ప్రస్తావనను తీసుకొచ్చారు ఈ చిత్ర దర్శకుడు రాఘవ.. సీఎం చంద్రబాబు, జగన్ పాత్ర ఈ సినిమాలో ఎవరు పోషించారనే ప్రశ్నకు దర్శకుడు ఊహించని సమాధానం ఇచ్చారు.
ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు. వైఎస్ఆర్ గారి గురించి చెప్పడం కోసం ఇతరులను తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఆయన తనయుడి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా సినిమాలో లేదు. కేవలం రెండు నిమిషాల కోసం ఆయన పాత్ర పెట్టి ప్రేక్షకులను తికమక పెట్టడం మంచిది కాదనే ఉద్దేశ్యంతోనే ఎంచుకోలేదని సమాధానమిచ్చారు. దాంతో చంద్రబాబు, జగన్ పాత్ర 'యాత్ర'లో లేదని తేలిపోయింది.