ఇళయరాజా-బాలు కలిశారు.. అభిమానులు మురిశారు!

Update: 2019-06-02 17:04 GMT

ఇళయరాజా.. నిశ్శబ్దాన్ని సంగీతం లా వినిపించగల జ్ఞాని.. బాలు రాగాలనే రంజింపచేసే స్వరఝురి.. ఈ ఇద్దరి కలయికలో కొన్ని వందల పాటలు వచ్చాయి. అవి దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా సంగీతాభిమానుల చెవుల్లో అమృతాన్ని పోస్తూనే ఉన్నాయి. వీరిద్దరి కలయికే సినీ సంగీతానికి కొత్త ఒరవడి దిద్దింది. అటువంటి ఈ ఇద్దరు కొన్నాళ్ల క్రితం ఎడమొఖం.. పెడమొఖంగా అయిపోయారు. తన పాటలు స్తేజిలపై పాడితే తనకు రాయల్టీ ఇవ్వాలని ఇళయరాజా బాలుని అడగడం.. ఆనక కోర్టుకి వెళ్ళడంతో ఇద్దరి మధ్య స్వరాలు మూగబోయాయి. ఇద్దరి అభిమానులూ కలత చెందడం తప్ప ఏమీ చేయలేకపోయారు.

చాలా కాలం తరువాత ఈ సినీ సంగీత దిగ్గజాలు ఒక దగ్గర చేరాయి. ఇళయరాజా జన్మదినం సందర్భంగా ఒక సంగీత విభావరిలో ఇద్దరూ పాల్గొంటున్నారు. దానికి సంబంధించి ఇద్దరూ చెన్నైలో రిహార్సల్స్ లో కూడా పాల్గొన్నారు. దీనికే అభిమానులు సంబరాపదిపోతుంటే.. ఇపుడు ఇంకో వార్త ఫిలిం వర్గాల్లో హల్చల్ చేస్తోంది. విజయ్ ఆంటోని హీరోగా నటిస్తోన్న 'తమిళ రసన్' సినిమా కోసం ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఒక డ్యూయట్ పాడారు. ఈ పాట రికార్డింగ్ సమయంలో వీళ్లిద్దరు ఎంతో ఉత్సాహాంగా కనిపించడంతో సంగీతాభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇపుడు అభిమానులు సంబరంగా ఉన్నారు. 

Similar News