యాత్రే వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేలా చేసింది. యాత్రే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి కారణమైంది. యాత్రే ప్రజల సమస్యలు తెలుసుకునేలా చేసింది. యాత్రే జగన్కు అఖండ విజయాన్ని కట్టిపెట్టింది.
వైఎస్ జగన్ రాజకీయ ఎదుగుదలకు, ప్రజల గుండెల్లో చొచ్చుకుపోవడానికి యాత్రలు కీలకంగా వ్యవహరించాయని చెప్పక తప్పదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మృతిని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు మొదటి సారి జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ ఆయన ప్రారంభించిన ఓదార్పు యాత్రే వైసీపీ ఆవిర్భావానికి ఒక కారణమంటారు.
ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ నాయకత్వం అభ్యంతరం చెప్పడంతో జగన్ హస్తం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం సొంతంగా పార్టీ ప్రారంభించారు. వైసీపీని స్థాపించిన తర్వాత కూడా జగన్ ఓదార్పు యాత్రను కొనసాగించారు. జగన్ తరపున 2012లో ఆయన సోదరి షర్మిల ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం వరకు మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేశారు. ఈ యాత్ర కూడా వైసీపీ ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి కారణమైంది.
ప్రజా సమస్యలను తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడానికి వైఎస్ జగన్ 2017 నవంబర్ 6న ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర 2019 జనవరిలో ఇచ్ఛాపురంలో ముగిసింది. 341 రోజుల పాటు 13 జిల్లాల్లో 3,648 కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేయడం దేశ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచింది. ఈ యాత్రలో మహిళలు, వృద్ధులు, యువకులు ఇలా అన్ని వయసుల వారు, వర్గాల వారు జగన్ను అక్కున చేర్చుకున్నారు. అఖండ విజయాన్ని కట్టబట్టారు. రాజకీయ పోరాటం ప్రారంభించడానికి, పేదల జీవితాన్ని దగ్గరగా చూడటానికి, వారి కష్టాలు తెలుసుకోవడానికి జగన్కు యాత్రలు ఎంతో ఉపయోగపడ్డాయి.