పార్లమెంట్ ఎన్నికల్లో పోటి చేసే టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా సిద్దమైంది. నేడు ఆ పార్టీ అధినేత కేసీఆర్ 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం ఇచ్చిన గులాబీ బాస్ ఎంపీల విషయంలో ఆ రూల్ను పక్కనపెట్టినట్లు చెబుతున్నారు. కొందరు సిట్టింగులను కాదని కొత్త అభ్యర్థులను రంగంలోకి దించబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
లష్కర్పై ఈసారి గులాబి జెండా ఎగురవెయ్యడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం కేసీఆర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్కు సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే రేసులో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి యాదవ్ కూడా టికెట్టు ఆశిస్తుండటంతో ఎవరికి దక్కుతుందనేది తెలియాల్సి ఉంది. అలాగే మల్కాజ్గిరి నుంచి రేవంత్రెడ్డికి పోటీగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి దింపే అవకాశాలున్నాయి.
ఖమ్మం బరిలో నామా నాగేశ్వరరావు నిలిపే అవకాశాలున్నాయి. అయితే వ్యాపారవేత్త వీవిసి రాజేంద్రప్రసాద్ సైతం పోటీలో ఉన్నా నామాకే ఎంపి టిక్కెట్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. వరంగల్ పార్లమెంట్ స్థానానికి సిట్టింగ్ ఎంపి పసునూరి దయాకర్ కు ఈసారి కూడా అవకాశం ఇవ్వబోతున్నారు. మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపి సీతారాంనాయక్కు కాకుండా మాజీ మంత్రి రెడ్యానాయక్ కూతురు మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవితకు అవకాశం ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎంపీ నగేష్కు మరోసారి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి నియోజకవర్గానికి మాజీ ఎంపీ వివేక్ పేరు దాదాపుగా ఖరారైంది. ఇక కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. భువనగిరి బరిలో బూర నర్సయ్య గౌడ్కు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. మెదక్ సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి మళ్లీ అవకాశం ఇస్తుండగా జహీరాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాఠిల్కు సైతం మరో అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సిట్టింగ్ ఎంపీ కవిత పేరు ఖరారైనట్టే అని తెలుస్తోంది. ఇటు నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డినే భరిలోకి దింపబోతున్నారు.
చేవేళ్ల, మహబూబ్నగర్ స్థానాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన కార్తిక్ రెడ్డి లేదా వ్యాపార వేత్త రంజిత్ రెడ్డికి చేవెళ్ల టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుండగా మహబూబ్నగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ జితెందర్ రెడ్డి అభ్యర్థిత్వంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే రేసులో ప్రముఖ ఫార్మా దిగ్గజం మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఎంపిక చేసినట్లు చర్చ జరుగుతోంది. నాగర్ కర్నూల్ బరిలో మాజీ మంత్రి పీ. రాములుకు టిక్కెట్ను దాదాపు ఖరారు చేశారు సీఎం కేసీఆర్. అభ్యర్థుల కసరత్తు పూర్తైన వేళ అసంతృప్తుల విషయంలో కూడా కేసీఆర్ చర్చిస్తున్నారు. ప్రగతి భవన్లో ఆయా జిల్లాల ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నారు.