మంచి మనసు చాటుకున్న ఎంపీ బూర నర్సయ్యగౌడ్

Update: 2019-02-09 06:47 GMT

ఏ పదవిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా సామాన్య ప్రజల కోసం పాటు పడే వ్యక్తులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ఒకరు. డాక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఎంపీగా మారిన బూర నర్సయ్య గౌడ్ మంచి మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ గాయపడిన విషయం గమనించిన ఆయన తన కారును ఆపి మరీ సపర్యలు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంకి చెందిన వెంకటేశ్వర్లు, నాగరాజు, నాగమణి కలిసి నిన్న బైక్‌పై హైదరాబాద్ నుంచి సొంతూరు బయల్దేరారు. నాగమణి తండ్రి చనిపోవడంతో అంత్యక్రియల కోసం వెళ్తున్న వాహనం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామం వద్ద అదుపు తప్పి ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురూ కిందపడిపోగా నాగమణికి దెబ్బలు గట్టిగా తగిలాయి.

ప్రమాదం జరగ్గానే స్థానికులంతా అక్కడ గుమిగూడి ఆమెను పైకి లేపారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు కార్లో వెళ్తున్న భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించారు. డాక్టర్ అయిన ఆయన కారును పక్కకు ఆపి గాయపడిన మహిళకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అంబులెన్స్‌లో ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే తనకెందుకులే అని వెళ్లిపోకుండా ఎంపీ ఇలా స్పందించడం, సామాన్యురాలికి సపర్యలు చేయడంతో స్థానికులు ఫిదా అయ్యారు. ఆయన సేవా గుణాన్ని ప్రశంసిస్తున్నారు. 

Similar News