సాయంత్రం అయ్యిందంటే చాలు ఈదురుగాలులు బీభత్సం భారీగా వర్షం ఏదో ఒకటి కింద పడటం ఒకరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం గత వారం రోజులుగా రాజధాని వాతావరణం హైదరాబాదీలను భయపెడుతోంది. ఎప్పుడు ఏది మీదపడి ప్రాణాలు తీస్తుందో అన్న భయం నగరవాసులను వెంటాడుతోంది.
గత కొన్నిరోజులుగా హైదరాబాద్ వాతావరణం విచిత్రంగా మారింది. మధ్యాహ్నం ఎండ దంచి కొడుతుంటే సాయంత్రం అయ్యిందంటే చాలు మేఘాలు కమ్ముకోవడం ఆ వెంటే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు రావడం తర్వాత వాన బీభత్సం కొనసాగడం కామన్గా మారింది. అయితే ఈ అకాల వర్షాలకు ఇన్నాళ్లూ చెట్లు, గోడలు, ఇంటి పైకప్పులు కూలినఘటనలున్నాయి. కానీ సోమవారం ఎల్బీ స్టేడియంలో భారీ ఫ్లడ్ లైట్ టవర్ కూలడంతో నగర జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఈ ఘటనతో వర్షం పడితే చాలు ఎప్పుడు ఏది తమపై పడిపోతుందో అనే భయంతో ఉన్నట్లు నగరవాసులు చెబుతున్నారు. వాహనదారులైతే వర్షంలో తడవకుండా చెట్ల పక్కన ఆగారో అంతే చుట్టుపక్కల చూస్తూ భయంతో గడపాల్సి వస్తోంది. ఎప్పుడు ఏ చెట్టు, ఏ హోర్డింగ్ తమపై పడుతుందో అనే టెన్షన్ పట్టుకుంది. చిన్నపాటి గాలి వీస్తే చాలు హోర్డింగ్స్, ఆర్చులు వంగుతున్నాయి. హోర్డింగ్స్ నుంచి ఫ్లెక్సీలు చినిగిపోయి రోడ్లపై, విద్యుత్ వైర్లపై పడుతున్నాయి. దీంతో రోడ్లపై ఏ హోర్డింగ్ ఎప్పుడు మీద పడుతుందోనన్న భయం నగరవాసులను వెంటాడుతోంది.
అయితే గ్రేటర్ పరధిలో హోర్డింగులను నిషేధిస్తూ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. కానీ రోడ్లపై ఎక్కడ చూసినా హోర్డింగులు కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం వాటి భద్రత ఎంతమేర అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నపాటి గాలివానకు కూడా భారీ హోర్డింగులు కూలుతుండటంతో అలాంటి వాటిపై గ్రేటర్ అధికారులు నజర్ పెట్టాలని కోరుతున్నారు. హోర్డింగుల విషయంలో ప్రతి ఏటా స్ట్రక్చరల్ స్టెబిలిటి ధృవ ప్రతాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలా హోర్డింగ్స్ యజమానులు ఇలాంటి పత్రాలేవీ సమర్పించడం లేదు. ఇలాంటి సందర్భంలో హోర్డింగుల భద్రతపై దృష్టిసారించాలని అనుమతుల్లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.