గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్కు టీడీపీ నేతలు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. ఈ మేరకు టీడీపీ నేతల బృందం రేపు జగన్ను తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలవనుంది. టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు జగన్ను కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున శుభాకాంక్షలు తెలపనున్నారు. అలాగే చంద్రబాబు అభినందన లేఖను జగన్కు అందజేయనున్నారు. జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లే అంశంపై టీడీఎల్పీలో ఆసక్తికర చర్చ జరిగింది. ప్రమాణ స్వీకారానికి వెళ్లేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఆయన నిర్ణయాన్ని పార్టీ నేతలు తప్పుబట్టినట్లు తెలుస్తోంది. రాజ్భవన్ వంటి వేదికల వద్ద ప్రమాణ స్వీకారం చేస్తే వెళ్లొచ్చని, బహిరంగంగా ప్రమాణస్వీకారం చేస్తున్నందున వెళ్లడం సరికాదని నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీ తరపున బృందాన్ని పంపాలన్న నేతల సూచనకు బాబు అంగీకారం తెలిపారు.