దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీడియో వివాదంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన తన వీడియోపై ఎమ్మెల్యే చింతమనేని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీ రవిప్రకాష్ కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే బడేటి జుజ్జి కూడా చింతమనేనికి మద్దతుగా వచ్చారు.
సోషల్ మీడియాలో చింతమనేని ఎడిటింగ్ వీడియోపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ కు చేరుకున్న టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మరోవైపు వైసీపీ శ్రేణులు కూడా ఆందోళనకు దిగడంతో ఇరుపార్టీ నేతలు పోటా పోటీగా నిరసనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు వైసీపీ, టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. తన వీడియో ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని ఎమ్మెల్యే చింతమనేని ఆరోపిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఏంటో ఓసారి చూద్దాం.