ఇందిరాపార్క్ ధర్నాలో కాంగ్రెస్ నాయకుల కుమ్ములాటపై టీ పీసీసీ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై యాక్షన్ తీసుకునేందుకు క్రమశిక్షణా సంఘం ఛైర్మెన్ కోదండరెడ్డి సమావేశం అయ్యారు. టీపీసీసీ చీఫ్ అధికార ప్రతినిధి నగేశ్ ముదిరాజ్ను పార్టీ నుంచి బహిష్కరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీన్ని వీహెచ్ పై దాడి జరిగిందని భావిస్తున్నట్లు చెబుతున్న క్రమశిక్షణా సంఘం ఘటనను తీవ్రంగా ఖండించింది.
ఈ ఉదయం ఇందిరాపార్క్ దగ్గర అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ ఏర్పాటు చేసిన దీక్షా వేదికపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా కోసం వేసిన కుర్చీలో టీ పీసీసీ అధికార ప్రతినిధి నగేశ్ ముదిరాజ్ కూర్చునేందుకు ప్రయత్నించారు. దీన్ని గమనించిన వీహెచ్ ఆయన్ని అడ్డుకున్నారు. నగేశ్ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. వినకపోయే సరికి వీహెచ్ చేయి చేసుకునే వరకు వెళ్లింది. ఆ వెంటనే వీహెచ్ చొక్కాను నగేశ్ పట్టుకోవడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇద్దరూ కిందపడిపోయారు. ఈ ఘటనపై టీ పీసీసీ క్రమశిక్షణా సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నగేశ్ను బహిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది.