సిలోన్ టు చీరాల అక్కడి ఆచారాలే.. ఇక్కడ ఆనవాయితీలు. అమ్మవారికి భక్తిభావంతో ఒంటిపై శూలాలు గుచ్చుకుని గాల్లో తేలుతారు. అలా కొన్ని క్షణాలు నిమిషాలు కాదు గంటలు తరబడి గాల్లో వేలాడుతారు. ఇలాంటి వింతైన ఆచారాలతో శ్రీ ముత్తుమరియమ్మన్ ఉత్సవాలు ఏపీలో ప్రతి ఏడాది ఘనంగా జరుగుతాయి. ఆ ఉత్సవాలు మనమూ తిలకించాలంటే ప్రకాశం జిల్లా చీరాలకు వెళ్లాల్సిందే.
శ్రీ ముత్తు మరియమ్మన్ అమ్మవారి ఉత్సవాలు ఇవి శ్రీలంకలో మాత్రమే జరుగుతాయి. కానీ ఈ ఉత్సవాలను ప్రకాశం జిల్లా వేటపాలెంలోని సిలోన్ కాలనీలో కూడా నిర్వహించడం ఆనవాయితీ. ఎన్నో ఏళ్ల క్రితం సిలోన్ నుంచి వచ్చిన శ్రీలంక వాసులు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. కాలక్రమంలో ఇక్కడే శ్రీ ముత్తు మరియమ్మన్ అమ్మవారి దేవస్థానాన్ని సైతం నిర్మించారు. అప్పటి నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.
శ్రీ ముత్తు మరియమ్మన్ ఉత్సవాలను ముచ్చటగా మూడు రోజుల పాటు కన్నుల పండుగగా జరుపుతారు. అమ్మవారికి సాంప్రదాయ బద్ధంగా ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహిస్తూ స్థానికులు తమ భక్తిభావాలను చాటుకుంటారు. ముఖ్యంగా చివరి రోజున ఆచారసాంప్రదాయాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వహించి, అమ్మవారిని తలుచుకుంటూ శరీరంపై శూలాలతో గుచ్చుకుని పూర వీధులలో ఊరేగింపుగా వేడుకలు జరుపుతారు.
ఒళ్లు గగుర్పొడిచేలా శూల శోధన చేసుకుని అమ్మవారి పట్ల తమకున్న విశ్వనీయతను చాటుకుంటారు. శూల శోధన చేసుకున్న భక్తులు ప్రత్యేకంగా తీసుకొచ్చిన క్రేన్ సహకారంతో ఊరంతా ఊరేగిస్తూ ఉత్సవం జరిపిస్తారు. చీరాల జాండ్రపేట నుంచి వేటపాలెం వరకు ఈ ఊరేగింపు కొనసాగుతుంది. భక్తులు సైతం కులమతాలకు అతీతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. దారి పొడవునా మహిళా భక్తులు జల బిందులతో ఊరేగింపులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.