పుల్వామా ఉగ్రదాడి నేపధ్యంలో ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా సైన్యం ప్రణాళికలు అమలు చేస్తోంది. కశ్మీర్ లోయ వ్యాప్తంగా దాగి ఉన్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా బారాముల్లా జిల్లా సోపోర్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. వార్పూర్ గ్రామంలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాగి ఉన్నట్టు గుర్తించిన సైన్యం పారా మిలటరీ, జమ్ము పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. ఉగ్రవాదులు తప్పించుకోకుండా చుట్టుపక్కల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది.