చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఏడు కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పాకాల మండల పరిధిలోని పులివర్తిపల్లి, కుప్పంబాదురు, రామచంద్రాపురం మండలంలోని ఎన్.ఆర్.కమ్మపల్లి, కమ్మపల్లి, కొత్తకండ్రిగ, వెంకటరామపురం, కాళేపల్లిలో సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రీపోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద ఒక ఐపీఎస్ స్థాయి అధికారి పోలింగ్ను పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు.
రీపోలింగ్ జరుగుతున్న ఏడు కేంద్రాల్లో పోలింగ్ శాతం అంతకంతకు పెరుగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు తరలివస్తున్నారు. మధ్యాహ్నం 3గంటల సమయానికి ఏడు కేంద్రాల పరిధిలో 67.55 శాతం పోలింగ్ నమోదైంది. వెంకట్రామాపురంలో ఇప్పటి వరకు 86.21 శాతం ఓటింగ్ నమోదుకాగా కమ్మపల్లిలో 54.96 శాతం, పులివర్తిపల్లిల్లో70.81, కాళేపల్లిలో 77.55, కొత్త కండ్రిగలో 61.86, ఎన్.ఆర్.కమ్మపల్లిలో 72.49, కుప్పం బాదూరులో 67.02శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 5 వేల 451 మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకు 3వేల 682 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది రీపోలింగ్ పరిస్ధితిని స్వయంగా సమీక్షించారు. సచివాలయంలోని కమాండ్ కంట్రోల్ నుంచి ఏడు కేంద్రాల్లోని పోలింగ్ తీరును పరిశీలించారు. ఇక ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ సీనియర్ నేతలు రీ పోలింగ్ కేంద్రాల దగ్గర మకాం వేసి పరిస్ధితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటున్నారు. కమ్మపల్లె పోలింగ్ కేంద్రం దగ్గర తన తల్లి ఓటు తానే వేస్తానంటూ పోలింగ్ అధికారులతో గొడవకు దిగాడు. నిబంధనలకు విరుద్ధంగా అలా ఓటు వేయకూడదని అధికారులు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో జయచంద్ర నాయుడును అదుపులోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు.
అయితే, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని స్వగ్రామం పులివర్తిపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. పులివర్తిపల్లిలో ఓటర్లను ప్రలోభపెట్టిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బావమరిది కేశవరెడ్డిని పులివర్తి నాని అడ్డుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నానిపై కేసు నమోదు చేశారు. కేశవరెడ్డి వైసీపీ జనరల్ ఏజెంటుగా ఉన్నారు. కమ్మపల్లిలో మునిచంద్రనాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగ ఓటు వేయడానికి వచ్చాడనే అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.