ఎన్నికలవేళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. పేదలను ఆకట్టుకునేందుకు సరికొత్త హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి కనీస ఆదాయం కల్పించనున్నట్లు ప్రకటించారు.
అగ్రవర్ణాల్లోకి పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్రమోడీకి దీటుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. ఎన్నికలవేళ పేదలను ఆకట్టుకునేందుకు సరికొత్త హామీ ఇచ్చారు. మినిమం ఇన్కం గ్యారంటీ పేరుతో ట్వీట్స్ చేసిన రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు కనీస ఆదాయం కల్పిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఇది మా దార్శనికత, హామీ అంటూ రాహుల్ పేర్కొన్నారు.
ప్రపంచంలో ఏ ప్రభుత్వం చేయలేని పనిని కాంగ్రెస్ పార్టీ చేయబోతోందని రాహుల్గాంధీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడి అకౌంట్లోకి కనీస ఆదాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఆకలి, పేదరికాలను నిర్మూలించేందుకే తాము ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నామన్నారు.
కోట్లాది మంది మన సోదర, సోదరీమణులు పేదరికంతో బాధలు అనుభవిస్తూ ఉంటే, మనం నవ భారతాన్ని నిర్మించలేమన్న రాహుల్ 2019లో అధికారంలోకి వస్తే, పేదరికాన్ని, ఆకలిని నిర్మూలించడానికి ప్రతి పేదవాడికి కనీస ఆదాయ హామీని ఇచ్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.