ఏపీ రాజకీయాల్లో జోరందుకున్న ఫిరాయింపులు
సార్వత్రిక ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడుతుందనే వార్తల నేపధ్యంలో ఏపీ రాజకీయాల్లో ఫిరాయింపులు జోరందుకున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడుతుందనే వార్తల నేపధ్యంలో ఏపీ రాజకీయాల్లో ఫిరాయింపులు జోరందుకున్నాయి. పలువురు అధికారపార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష వైసీపీ వైపు చూస్తూ ఉండగా వైసీపీ నుంచి టీడీపీలోకి మళ్లీ వలసలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత వంగవీటి రాధా టీడీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 25న ఆయన టీడీపీలో చేరే అవకాశముంది. ఇక ఇదే సమయంలో టీడీపీ నేతల తీరుతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రాజంపేట ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. సాయంత్రం నాలుగు గంటలకు జగన్ను కలవనున్న మేడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరే అవకాశాలున్నాయి.
ఇదే సమయంలో ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ ఎంపీ ఒకరు వైసీపీలో చేరే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో కీలక నేతగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ బాపట్ల నుంచి ఎంపీగా గెలిచిన బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి కూడా వైసీపీతో టచ్లో ఉన్నట్టు పోలిటికల్ కారిడార్లో ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు గత ఎన్నికల్లో పరాజయానికి కారణాలు అన్వేషించిన వైసీపీ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలువురు టీడీపీ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. తాజా పరిణామాల నేపధ్యంలో ఏపీలో రాజకీయాలు హాట్హాట్గా మారాయి.