ఏపీలో ఎన్నికల ప్రచారం మారుమోగుతోంది. ఆయా పార్టీ నేతలు ఒకరిపై మరోకరు దూమ్మెత్తుపొసుకుంటున్నారు. కాగా ఈ నేపథ్యంలో జనసేన - తెలుగుదేశం పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ అని సోషల్ మీడియాలో ,ప్రజల్లో కూడా మారుమోగుతోంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ప్రకాశం జిల్లా గిద్దెలూరులో జనసేన అభ్యర్థి కోసం పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ అసలు తనకు దొంగ పొత్తులు పెట్టుకునే అవసరం లేదని జనసేనాని స్పష్టం చేశారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే తాము ధైర్యంగా పొత్తు పెట్టుకుంటామని, వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి లాగా తెరవెనుక పొత్తు పెట్టుకోమని పవన్ విమర్శించారు. అయితే పవన్ ధైర్యంగా చంద్రబాబుతో కలుస్తామని అనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీడీపీతో పొత్తు విషయంలో జనసేనాని ఇంత సానుకూలంగా ఉండడం ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. ఏపీలో హంగ్ వస్తే పవన్ మళ్లీ తెలుగుదేశంతో కలిసి పోవడానికి ఈ మాటలు ఊతమిచ్చేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. జనసేన-టీడీపీ అంతర్గత పొత్తు వ్యవహారం మరోసారి అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది.