నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ హోరెత్తే నినాదాలు ప్రత్యర్థుల ఊహకందని ప్రణాళికలతో జనరంజక వాగ్దానాలు మంటల్లాలంటి మాటలు బాణంలాంటి విమర్శనాస్త్రాలు ఎన్నికలకు నాలుగు వారాల తరుణంలో, జనసైనికులను ఉర్రూతలూగించే యుద్ధ శంఖారావం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో, జనసేన ఆవిర్భావ దినోత్సవంలో, ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిప్పు కణికల్లాంటి మాటలతో చెలరేగిపోయారు. రైతులు, మహిళలు, యువతే లక్ష్యంగా వాగ్దానాలవర్షం కురిపించారు. త్రిముఖ సమరంలో, ప్రముఖంగా నిలబడుతున్నామంటూ, శంఖారావం పూరించారు పవన్ కల్యాణ్. రాజమండ్రి సభతో జనసేనాని చెప్పదల్చుకున్నది సూటిగా చెప్పేశారా పవన్ ప్రసంగం చెబుతున్నదేంటి?
ఎన్నికల తేదీ దగ్గరపడుతోంది జనసేన ఎక్కడా అన్నారు. అభ్యర్థుల అడ్రసేంటన్నారు. అసలు పవన్ రాజకీయ దారేంటని ప్రశ్నించారు బాబుతో నడుస్తున్నారా జగన్ అడుగుల్లో అడుగేస్తున్నారా అని కూడా, ప్రధాన పార్టీలు ఆరోపించాయి. వాటన్నింటికీ సమాధానం ఇదే అన్నట్టుగా, రాజమండ్రి సభతో చెలరేగిపోయారు పవన్. టీడీపీ, వైసీపీలకు పోటీగా, దీటుగా మేనిఫెస్టోలను రంగరించారు. జనసేన ఎన్నికల ప్రణాళికలో ముఖ్యాంశాలేంటి ఎవరిని లక్ష్యంగా చేసుకుని పవన్ వరాలు కురిపించారు?
రాజమండ్రిలో ఆర్ట్స్ కళాశాల మైదానంలో జనసేన ఆవిర్భావ దినోతవ్స సభ, హోరెత్తేలా సాగింది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన జనంతో రాజమహేంద్రవరం జనసాగరంలా మారింది. ఇన్నాళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న జనసేన, రాజమండ్రి సభతో ఒక్కసారిగా ఆ నిశ్శబ్దాన్ని చేధించింది. ఎన్నికల తరుణంలో, కార్యకర్తలను సమ్మోహితులను చేసింది. ఇక సార్వత్రిక సమరంలో సైనికుల్లా దూకాలన్న పవన్ పిలుపుకు, ఆర్ట్స్ కళాశాల మార్మోగింది.
రాజమండ్రి సభతో ప్రత్యర్థులకు అదిరిపోయే సందేశమివ్వాలని భావించిన పవన్, నిజంగానే ఎవరి ఊహకు అందని విధంగా సభను సక్సెస్ చేశారు. ఒకవైపు పార్టీ పెట్టడానికి, ప్రజలకు సేవ చేయడానికి తనకు ప్రేరణ కలిగించిన అంశాలను వెల్లడిస్తూనే, మరోవైపు ప్రజాకర్షక పథకాల వెల్లడిస్తూ, ఇంకోవైపు ప్రత్యర్థులపై విమర్శల బాణాలు సంధిస్తూ, గడగడలాడే ప్రసంగం చేశారు పవన్. తన ప్రసంగంలో ప్రధాన ఆయుధమైన ఎమోషనల్ స్పీచ్ను, పదునైన మాటలతో దుమ్మురేపారు.
ప్రధానంగా రైతులు, మహిళలు, యువతే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించింది జనసేన. కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా ప్రధాన ఎన్నికల వరమైన, రైతులకు కనీస పెట్టుడి సాయాన్ని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే, రైతులకు ఏడాదికి 8 వేల సాయం చేస్తామన్నారు.
60 ఏళ్లు దాటిన రైతులకు రూ.5వేల పింఛన్
ప్రతి రైతుకు ఉచితంగా సోలార్ మోటర్ పంపులు
ఒకటి నుంచి పీజీ వరకు ఉచిత విద్య
అన్నీ కులాలకు కలిపి కామన్ హాస్టల్స్
కులాలకు సంబంధం లేకుండా ఏడాదికి ఒకే ఫీజు
విద్యార్థులకు ఉచిత రవాణా
విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ క్యాంటిన్లు
వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి
మొత్తం 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ఉద్యోగాలు
మత్స్యకారులకు మరపడవలు
మత్స్యకారులకు 300ల రోజులు ఉపాధి
మత్స్యకారులకు ప్రత్యేక బ్యాంకు
డ్వాక్రా సంఘాలు, స్వయం ఉపాధి ఆడపడుచులకు ప్రాధాన్యత
డ్వాకా సంఘాల కోసం ప్రత్యేక బ్యాంకు
ఆడపడుచులకు ఉచిత గ్యాస్ సిలిండర్
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
స్త్రీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థలు
కుల, మత ప్రాంతాలకు అతీతంగా ఆడపడుచులకు సత్కారం
ఏ మతస్తుల ఆడపడుచులకైనా పండుగలకు చీరల పంపిణీ
ప్రతి జిల్లాకు ఒక మహిళా ఆరోగ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
రెల్లి యువతకు రూ.50వేలు వడ్డీ లేని రుణం
రెల్లి మహిళలకు ఉచితంగా స్కూటర్లు
ఉభయగోదావరి జిల్లాల్లో రూ.5వేల కోట్లతో గ్లోబల్ మార్కెట్
13 జిల్లాలకు 10 చొప్పున 130 స్మార్ట్ సిటీలు
జనసేన మ్యానిఫెస్టో జనరంజకంగా ఉందని, ఆ పార్టీ నేతలంటున్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి తోడ్పడేలా ఎన్నికల ప్రణాళిక ఉందన్నారు.