పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రెండో దశ అటవీ అనుమతి లభించింది. కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ అనుమతి ఇస్తున్నట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది.
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రెండో దశ అటవీ అనుమతి లభించింది. కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ అనుమతి ఇస్తున్నట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. ఈ విషయం తెలియగానే సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర అటవీశాఖ మంత్రి హర్షవర్ధన్కు ధన్యవాదాలు తెలిపారు.
ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.3లక్షల ఎకరాలకు సాగునీరు, వెయ్యికి పైగా గ్రామాలకు తాగునీరు అందించే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోత పథకానికి కేంద్రం నుంచి తుది అటవీ అనుమతులు లభించాయి. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి కేంద్ర అటవీశాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రవణ్కుమార్ వర్మ లేఖ రాశారు. దీంతో సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్కు ధన్యవాదాలు తెలిపారు.
ప్రాజెక్టు నిర్మాణానికి నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట అటవీ డివిజన్లో ఉన్న అటవీ భూమిని సాగునీటిశాఖకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి 2017 మే నెలలో లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధనను ఫారెస్ట్ అడ్వయిజరీ కమిటీ పరిశీలించి 2018 ఏప్రిల్ నెలలో మొదటి దవ అటవీ అనుమతిని కేంద్రం మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం విధించిన అన్ని విధివిధానాలను రాష్ట్ర్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసిన కారణంగా కేంద్ర పర్యావరణ అటవీశాఖ ప్రాజెక్టుకు తుది అనుమతిని మంజూరు చేసింది.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో నిర్మాణం అవుతున్న మొదటి స్టేజ్ పంప్ హౌస్, నార్లపూర్ వద్ద అంజనగిరి జలాశయ నిర్మాణం, నార్లపూర్ అంజనగిరి - ఏదుల వీరంజనేయ జలాశయం మధ్య టన్నెల్ తవ్వకానికి ఈ అటవీ భూముల బదిలీ అవసరమైంది. ఈ అనుమతితో 204.48 హెక్టార్ల అటవీ భూమి పాలమూరు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఆధీనంలోకి రానుంది.
అయితే, అటవీ, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులను కొనసాగిస్తున్నారని, ఆ పనులు ఆపాలంటూ ఎన్జీటీలో కేసులు దాఖలయ్యాయి. రాష్ట్ర్ర ప్రభుత్వం కేవలం తాగునీటి సరఫరా కోసమే పనులు చేపట్టిందని, పర్యావరణ, అటవీ అనుమతులు పొందిన తర్వాతే సాగునీటి పనులు చేపడుతుందని ఎన్జీటీకి తెలిపింది. ఈ కేసుల నేపధ్యంలో కేంద్రం నుంచి అటవీ అనుమతులు రావడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నిర్ణయించింది.