కాంగ్రెస్ విలీనంతో తెలంగాణ అసెంబ్లీలో సీన్ మారబోతోంది. నిన్నటి వరకు చిన్న పార్టీగా ఉన్న ఎంఐఎం సభలో అతి పెద్ద పార్టీగా మారింది. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోవటంతో మజ్లిసే సభలో ప్రతి పక్ష పార్టీగా అవతరించబోతోంది. టీఆర్ఎస్కు మిత్ర పక్ష పార్టీగా కొనసాగుతున్న ఎంఐఎం పార్టీయే ప్రతి పక్ష పార్టీగా వ్యవహరిస్తామంటుంది. ఢిల్లీ తరహాలో తక్కువ సీట్లున్న మాకు కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసద్ డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు అసెంబ్లీలో ఉన్న పరిస్తితి మారబోతోంది. ప్రధాన ప్రతి పక్షంగా కొనసాగిన కాంగ్రెస్ ఆ హోదాను కోల్పోయింది. టీఆర్ఎస్ ఎల్పీ లో కాంగ్రెస్ ఎల్పీ విలీనం తర్వాత సభలో కాంగ్రెస్ బలం 6 కు పడిపోయింది. మొత్తం ఈ పరిణామాలతో అసెంబ్లీలో కొత్త దృశ్యం దర్శనమివ్వబోతుంది. కాంగ్రెస్ ఎల్పీ విలీనానికి ముందు సభలో టీఆర్ఎస్ కు 90 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనం , టీడీపీ ఎమ్మెల్యే సండ్ర చేరికతో గులాబీ పార్టీ బలం 103 కు చేరింది. ఎంఐఎం బలం 7, కాంగ్రెస్ బలం 6 కు పడిపోయింది. బీజేపీ బలం ఒకటి, టీడీపీ బలం ఒకటి గా ఉంటుంది. విపక్ష పార్టీలన్నింటిలో ఎంఐఎంకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్నారు కాబట్టి ఈ పార్టీయే ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించబోతోంది.
ఎంఐఎం పార్టీ అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి టిఆర్ఎస్ కు మిత్ర పక్షంగా కొనసాగుతుంది. ఇప్పడు విలీనం తో మారిన పరిస్థితుల్లో మిత్ర పక్షమే ప్రధాన ప్రతిపక్షంగా సభలో ఉండబోతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేవలం సభ్యులుగానే కొనసాగబోతున్నారు. ఇక అసెంబ్లీ రూల్స్ ప్రకారం ప్రతిపక్ష పార్టీకి ఉండాల్సిన సౌకర్యాలన్ని ఎంఐఎంకు సంక్రమించబోతున్నాయి. ప్రభుత్వ పథకాల్లో ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా నిలువరించే ప్రజా పద్దుల సంఘం చైర్మన్ పదవి కూడా ఎంఐఎంకే దక్కే అవకాశాలున్నాయి. ఈ పదవి ప్రతి పక్ష పార్టీలకే దక్కే ఆనవాయితీ సభలో కొసాగుతోంది. కాబట్టి ఎంఐఎంకు దక్కనున్నట్లు తెలుస్తోంది. సభలో నియమించే వివిధ సభా సంఘాల్లో కూడా ఎంఐఎం పార్టీకే కీలక పాత్ర అవకాశం ఉంది. ప్రజా సమస్యలపై సభలో మాట్లాడేందుకు ప్రధాన ప్రతి పక్ష పార్టీకి ఇచ్చే సమయం కూడా ఎక్కువే. మొన్నటి వరకు ప్రభుత్వం తర్వాత ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం కాంగ్రెస్కు దక్కేది . ఇప్పుడు ఆస్థానం ఎంఐఎంకు దక్కనుంది.
మరోవైపు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ సభ్యులు తమ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలని కోరుతున్నారు. సాంకేతికంగా ఎంఐఎం పార్టీకి సరైన సంఖ్యాబలం లేనప్పటికీ ఢిల్లీలో ఆప్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ మూడు స్థానాలు గెలుచుకున్న బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఎంఐఎం ప్రతిపాదనపై ఇప్పటివరకు మిత్రపక్షంగా వివరిస్తున్న టిఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం పార్టీ సభలో ప్రతి పక్షంగా కొనసాగుతోంది కాబట్టి సభలో ప్రజా సమస్యలపై చర్చ ఎలా ఉంటుందో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.