ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు...'అశోక చక్ర' అందుకున్న అహ్మద్వానీ కుటుంబం
భారత 70వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అంబరాన్నంటాయి.
భారత 70వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అంబరాన్నంటాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాజ్పథ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకల్లో త్రివిధ దళాల పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా అత్యాధునిక ఆయుధాల ప్రదర్శనతో ఆర్మీ సత్తా చాటింది.
దేశ రాజధాని ఢిల్లీలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్పథ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ముఖ్య అతిథిగా హాజరవగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీ తదితరులు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా త్రివిధ దళాల పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డిఫరెంట్ డ్రెస్ కోడ్స్తో వివిధ బెటాలియన్లు నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది.
వివిధ రాష్ట్రాలు 17 శకటాలను ప్రదర్శించగా, అత్యాధునిక ఆయుధాల పరేడ్తో ఆర్మీ సత్తా చాటింది. 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 308మంది సైనిక సిబ్బందికి శౌర్య పతకాలు, ఒకరికి అశోక్ చక్ర, ఇద్దరికి కీర్తిచక్ర పురస్కారాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అందజేశారు. కశ్మీరీ వీర జవాను లాల్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీకి అశోక్ చక్ర ప్రకటించడంతో రాష్ట్రపతి చేతులు మీదుగా వనీ భార్య అవార్డును స్వీకరించారు.