కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద బీజేపీలో చేరారు. ఏపీ రాజకీయాల్లో అడుగుపెడతారన్న ఊహాగానాలకు తెరదించుతూ ఇవాళ ఢిల్లీలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ప్రముఖ నేత అమర్సింగ్ సన్నిహితురాలిగా ఉన్న జయప్రద గతంలో సమాజ్వాదీ పార్టీలో కొనసాగారు. యూపీలోని రామ్పూర్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు.
అయితే పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆమెను బహిష్కరించడంతో అమర్సింగ్తో కలిసి రాష్ట్రీయ లోక్మంచ్ పేరుతో పార్టీని స్థాపించారు. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. దీంతో అమర్సింగ్తో కలిసి ఆర్ఎల్డీలో చేరారు. 2014లో బిజ్నోర్ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో కొద్దిరోజులుగా మౌనంగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో జయప్రద రామ్పూర్ నియోజకవర్గం నుంచి తన చిరకాల ప్రత్యర్థి ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్పై పోటీ చేసే అవకాశం ఉంది.