కేసీఆర్‌ అంటే జగన్‌కు భయం...జనసేన దెబ్బేంటో చూపిస్తాం...

Update: 2019-03-23 04:07 GMT

తెలంగాణలో జనసేన బలమేంటో త్వరలోనే చూపిస్తామని పవన్ కల్యాణ్‌ అన్నారు. కేసీఆర్ అంటే ఉద్యమ నాయకుడిగా తనకు గౌరవం మాత్రమే ఉందని కానీ భయం లేదన్నారు. కేసీఆర్ అంటే జగన్‌కు భయమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆంధ్రోళ్లు రాజకీయాలు చేయొద్దన్న తలసానికి భీమవరంలో ఏం పనంటూ ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటల తూటాలు పేల్చారు. ఏపీలో రాజకీయాలు చేస్తున్నారంటూ టీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. జగన్‌కు సాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తే ఖబడ్డార్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు .

తెలంగాణలో ఏపీ నేతలు రాజకీయం చేస్తే సహించలేని టీఆర్ఎస్ నాయకులు ఏపీలో ఎందుకు చేస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు . భీమవరంలో నామినేషన్ వేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మంత్రి తలసానితో పాటు టీఆర్ఎస్‌పై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు .

కేసీఆర్ అంటే జగన్ భయపడుతున్నారని తనకు అలాంటిది ఏమి లేదన్నారు. తెలంగాణలో ఆంధ్రా ప్రజల ఆస్తుల జోలికి వస్తే ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. ఏపీలో అడ్డగోలు రాజకీయాలు చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. ఏపీ ప్రజల తరపున ప్రశ్నించేందుకు ప్రయత్నించిన తనపై దాడి చేసేందుకు ప్రయత్నాలు జరిగాయంటూ పవన్ ఆరోపించారు.

పవన్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పవన్ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్‌లో ప్రశాంతంగా జీవిస్తున్నారంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలపై తప్పుడు అభిప్రాయాలు కలిగించేలా పవన్‌ వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ ఆరోపించారు.

మరో వైపు పవన్ వ్యాఖ్యలను భీమవరం వైసీపీ అభ్యర్ధి గ్రంథి శ్రీనివాస్ తీవ్రంగా తప్పుబట్టారు. అవగాహన లేమితో పవన్ ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదన్నారు. తనకు మద్దతుగా తలసాని ఎప్పుడు ప్రచారం చేయలేదన్నారు. తాను భీమవరంలో ఉంటే హైదరాబాద్‌ నుంచి వచ్చిన పవన్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ అజెండాలో భాగంగానే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు .    

Full View

Similar News