డేటా చోరీ కేసు ఎవరు దర్యాప్తు చేయాలి.? ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య నడుస్తున్న వాడి వేడి చర్చ ఇది. నేరం జరిగింది ఇక్కడే కేసు నమోదైందీ. ఇక్కడే కాబట్టి మేమే దర్యాప్తు చేస్తామని తెలంగాణ పోలీసులు అంటుంటే చోరీ అయిన డేటా మాది కాబట్టి తామే దర్యాప్తు చేసుకుంటామని ఏపీ పోలీసులు వాదిస్తున్నారు. దీంతో ఈ అంశం రెండు రాష్ట్రాల మధ్య కాక పుట్టిస్తోంది. అంతేకాదు డేటా చోరీ వ్యవహారంలో కేసుల పరంపర కొనసాగుతోంది.
ఐటీ గ్రిడ్ సంస్థపై దాఖలైన డేటా చోరీ కేసు వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల వాదన ఇది. డేటా దుర్వినియోగం కేసును తెలంగాణ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తోంటే..కేసును తమకే అప్పగించమని ఏపీ పోలీసులు పట్టుబడుతున్నారు. అయితే ఐటీ గ్రిడ్ సంస్థ టీడీపీకి సంబంధించిన 'సేవా మిత్ర' యాప్ను నిర్వహిస్తోందనీ.. ఆ సంస్థ దగ్గర ప్రజల ఆధార్, ఓటర్, పథకాల లబ్ధికి సంబంధించిన వివరాలు ఉన్నాయని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఐటీ గ్రిడ్ సంస్థ డైరెక్టర్ అశోక్ లొంగిపోయాకే మరిన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. కేసు బదిలీ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఐటీ గ్రిడ్ డేటా చోరీ కేసును సైబరాబాద్ కమిషనరేట్ కు చెందిన 4 బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ల్యాప్టాప్, హార్డ్డిస్క్లు, ప్రతాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతున్నారు. ఈ కేసులో మరింత సమాచారం కోసం ఆధార్ సంస్థకు, ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అలాగే ఐటి గ్రిడ్ సంస్థకు సర్వర్ ప్రొవైడర్గా ఉన్న అమెజాన్ సంస్థకూ నోటీసులు ఇచ్చారు. అయితే తెలంగాణ పోలీసుల దర్యాప్తులో ఏపీ పోలీసులు వేలు పెట్టడం సరికాదన్నారు సీపీ సజ్జనార్. ఫిర్యాదుదారుడు లోకేశ్వర్రెడ్డిపై దాడి చేసిన కేసులో ఏపీ పోలీసులపై కేపీహెచ్బీ పోలీస్టేషన్లో కేసు నమోదు చేశామని ఎంతటి వాళ్లనైనా వదిలేది ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అటు నలుగురు ఐటి గ్రిడ్ ఉద్యోగుల్ని తెలంగాణ పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఆ సంస్థ డైరెక్టర్ అశోక్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తమను తెలంగాణ పోలీసులు నిర్బంధించలేదని నలుగురు ఉద్యోగులు హైకోర్టుకు తెలిపారు. దీంతో వారికి కల్పించాలని తెలంగాణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అయితే ఉద్యోగుల నిర్బంధం విషయాన్ని కూడా ఏపీ పోలీసులు తప్పుదోవ పట్టించారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. మరోవైపు సేవా మిత్ర యాప్ ద్వారా ఏపీ ప్రజల డేటాను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ ఎస్సార్నగర్ పోలీస్స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఐటీ గ్రిడ్స్పై వైసీపీ యువజన విభాగానికి చెందిన రామ్ రెడ్డి ఫిర్యాదు చేశారు.