తెలంగాణ ఇంటర్ ఫలితాల అవకతవకలపై ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్ ఎట్టకేలకు స్పందించారు. పరీక్ష పేపర్లు గల్లంతైన మాట అవాస్తవమని, ఎగ్జామినర్ పొరపాటు వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. ఏ పేపర్ గల్లంతు కాలేదని పోలీసుల నిఘా మధ్య పేపర్లు భద్రంగా ఉన్నాయని తెలిపారు. పరీక్షలపై రీ వాల్యుయేషన్కు అప్లై చేసుకోవచ్చని, జవాబు పత్రాలు చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. రీ వాల్యుయేషన్ తేదీల గడువుపై ఆలోచిస్తామన్నారు. మరోవైపు సమస్యలపై విద్యార్థులు అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్ కుమార్ వివరించారు. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, తప్పు చేసిన అధికారులను వివరణ కోరినట్టు తెలిపారు.
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. మరోవైపు గ్లోబరీనా టెక్నాలజీ ప్రైవేటెడ్ లిమిటెడ్పై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్ ఫలితాల డేటాను గ్లోబరీనా టెక్నాలజీ కార్యాలయంలో తయారు చేశారు. కాగా మొత్తానికి గ్లోబెరినా టెక్నాలజీపై వచ్చిన ఆరోపణలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాగా త్రిసభ్య కమిటీ జరపాల్సిన విచారణ అంశాలపై జీవో 41 జారీ చేసింది. ఇక పూర్తి వివరాలు సేకరించి మూడ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది తెలంగాణ ప్రభుత్వం.