ఇటీవలే వైసీపీకి గుడ్బై చెప్పిన కర్నూలు జిల్లా గౌరు వెంకటరెడ్డి దంపతులు ఇవాళ టీడీపీలో చేరుతున్నారు. సాయంత్రం ఆరు గంటలకు అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు. పాణ్యం, నందికొట్కూరు నియోజకవర్గాల నుంచి దాదాపు 550 వాహనాల్లో గౌరు అనుచరులు, వైసీపీ కార్యకర్తలు అమరావతికి బయల్దేరారు. వైసీపీ తరుపున పాణ్యం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరు చరిత ఈసారి టీడీపీ తరుపున పాణ్యం నుంచే పోటీ చేయబోతున్నారు.
దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి గౌరు దంపతులు అత్యంత సన్నిహితులు. గౌరు వెంకటరెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో వైఎస్ ఆ కుటుంబానికి అండగా నిలిచారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణాంతరం తర్వాత వారు జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో పాణ్యం నుంచి గౌరు చరిత పోటీ చేసి గెలిచారు. అయితే ఇటీవల బీజేపీ నుంచి వైసీసీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డికి పాణ్యం టికెట్ను ఖరారయ్యిందని జోరుగా ప్రచారం ఉంది. వారు జగన్ను కలిసినా ఎలాంటి హామీ లభించలేదు. దీంతో ఈ నెల 1న వైసీపీకి గౌరు దంపతులు రాజీనామా చేశారు.