త్వరలో ఏపీలో కీలక అధికారుల బదిలీలు జరగనున్నాయి. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుండటంతో ప్రస్తుత డీజీపీ ఆర్.పి.ఠాకూర్ను తప్పించి ఆయన స్థానంలో గౌతమ్ సవాంగ్ను నియమించనున్నారు. జగన్ ప్రమాణస్వీకారం తర్వాత డీజీపీతోపాటు ఆర్థిక, వైద్యారోగ్యం, బీసీ సంక్షేమం, ఐటీ శాఖల అధికారులను బదిలీ చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. మరోవైపు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పీఎస్ఆర్ ఆంజనేయులును నియమించన్నట్టు తెలుస్తోంది.
ఏపీలో కీలక అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. డీజీపీ ఆర్.పి.ఠాకూర్తోపాటు పలువురు అధికారులను బదిలీ చేయనున్నారు. ఈనెల 30న సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం అనంతరం అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డీజీపీ ఆర్పీ ఠాకూర్ పనితీరుపై తీవ్ర అభ్యంతరాలు తెలిపిన వైసీపీ అధికారంలోకి రాగానే ఆయనకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేసింది. ఆయన స్ధానంలో గౌతమ్ సవాంగ్ను నియమించాలని నిర్ణయించింది.
గౌతమ్ సవాంగ్ ప్రస్తుతం ఆయన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. 1963, జులై 10న జన్మించిన గౌతమ్ సవాంగ్ 1986లో ఐపీఎస్కు సెలెక్ట్ అయి చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత చిత్తూరు, వరంగల్ జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. 2001-2003కాలంలో వరంగల్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. హోంగార్డు విభాగం డీఐజీగానూ సేవలందించారు.
2003-2004 వరకూ ఎస్ఐబీ డీఐజీగా, 2004-2005 మధ్య ఏపీఎస్పీ పటాలం డీఐజీగా పనిచేసిన సవాంగ్ ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్పై వెళ్లారు. 2005-2008 వరకూ సీఆర్పీఎఫ్ డీఐజీగా, 2008-2009 మధ్య శాంతిభద్రతల విభాగం ఐజీగా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత డిప్యుటేషన్పై మూడేళ్ల పాటు లైబీరియాలో ఐక్యరాజ్యసమితి పోలీసు కమిషనర్గా వ్యవహరించారు. 2015-2018 మధ్య విజయవాడ పోలీసు కమిషనర్గా పనిచేసి తనదైన ముద్రవేసిన సవాంగ్... గతేడాది జులై నుంచి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు విభాగం డైరెక్టర్ జనరల్గా కొనసాగుతున్నారు.
ప్రస్తుత డీజీపీ ఆర్పీ ఠాకూర్ గతేడాది జులై 1న డీజీపీగా బాధ్యతలు చేపట్టి 11 నెలలుగా పదవిలో కొనసాగుతున్నారు. డీజీపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొమ్ముకాస్తున్నారంటూ వైసీపీ నేతలు కొంతకాలం తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల విధుల నుంచి ఆయన్ని తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే ఈసీ వారి విన్నపాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో ఠాకూర్కు వెంటనే ఉద్వాసన పలుకుతున్నారు.
మరోవైపు డీజీపీతోపాటు ఆర్థిక, వైద్యారోగ్యం, బీసీ సంక్షేమం, ఐటీ శాఖల అధికారులను బదిలీ చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పీఎస్ఆర్ ఆంజనేయులును నియమించన్నట్టు తెలుస్తోంది. మరి ఆర్.పి.ఠాకూర్ రాష్ట్ర సర్వీసులోనే కొనసాగుతారా? లేక కేంద్ర సర్వీసులకు వెళ్తారా? అన్నది వేచిచూడాలి.