గతేడాది గడ్డు పరిస్థితులే ఈ ఏడాది కూడా రిపీట్ అవుతాయని ప్రముఖ వాతావరణ సంస్థ స్కైమెట్ హెచ్చరించింది. ఎల్నినో ఎఫెక్ట్తో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రకటించింది. నైరుతి రుతుపవనాలకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవన్న స్కైమెట్ ఎల్నినో ఇండెక్స్ గరిష్ట విలువను అధిగమించి భయపెడుతోందని తెలిపింది.
ఆందోళన చెందుతున్నట్లుగానే భారత్లో ఎల్నినో ఏర్పడిందని ప్రముఖ వాతావరణ సంస్థ స్కైమెట్ ప్రకటించింది. ఎల్నినో ఇండెక్స్ సాధారణం కంటే గరిష్ట విలువను అధిగమించి భయపెడుతోందని తెలిపింది. జనవరి నుంచి మార్చి వరకు నమోదైన ఇండెక్స్ను విశ్లేషించి స్కైమెట్ ఈ హెచ్చరిక చేసింది. ఎల్నినోతో జూన్ ఫస్ట్ వీక్లో విస్తరించనున్న నైరుతి రుతుపవనాలపై తీవ్ర ప్రభావం పడనుందని, దాంతో ఈ ఏడాది కూడా సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ప్రకటించింది. అంతేకాదు జూన్, జులైలో పరిస్థితి మరింత గడ్డుగా ఉంటుందని తెలిపింది.
గతేడాది సకాలంలోనే నైరుతి రుతుపవనాలు ఎంటరైనా ఎల్నినో ప్రభావంతో విస్తరించలేదని, దాంతో ఊహించిన స్థాయిలో వర్షాలు కురవలేదని స్కైమెట్ తెలిపింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుందని, ఒకవిధంగా చెప్పాలంటే రైతులకు ఇది గడ్డుకాలమని హెచ్చరించింది.