ఈ నెల 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఓటు వేయనున్నారా ? గత ఎన్నికల్లో మాదిరిగా ఓటర్ స్లిప్ ఉంటే సరిపోదు. ఓటర్ స్లిప్ తో పాటు ఎన్నికల కమిషన్ సూచించిన 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉండాలి. లేకుంటే ఓటు వేయడానికి అనుమతి ఇవ్వరు. ఈ నెల 11న తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఓటర్ స్లిప్ ఉంటే ఓటు వేయడానికి అనుమతి ఇచ్చేవారు. ఈ సారి ఓటర్ స్లిప్ తో పాటు ఎన్నికల కమీషన్ గుర్తించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ ఓటర్ ఐడీ కార్డు లేకపోతే ఏదో ఒక ఐడెంటిటీ కార్డ్ తప్పనిసరి. ఓటర్ ఐడీ కార్డు లేని వాళ్లు ఏఏ ఐడీ కార్డులు తీసుకెళ్లాలో తెలుసుకోండి.
ఎన్నికల కమిషన్ సిఫార్సు చేసిన 11 రకాల గుర్తింపు కార్డులు ఇవి.
1) పాస్పోర్ట్
2) డ్రైవింగ్ లైసెన్స్
3) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు/ ప్రభుత్వరంగ సంస్థలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీచేసిన ఉద్యోగుల ఫొటో గుర్తింపుకార్డు
4) బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోతోసహా జారీచేసిన పాస్ పుస్తకాలు
5) పాన్కార్డు
6) ఎన్పీఆర్ కింద ఆర్జీఐ జారీచేసిన స్మార్ట్కార్డు
7) నరేగా జారీచేసిన ఉపాధిహామీ పత్రం
8) ఆరోగ్య బీమా కింద కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ జారీచేసిన స్మార్ట్కార్డ్
9) ఫొటోజత చేసి ఉన్న పింఛన్ పత్రాలు
10) ఎంపీ/ ఎమ్మెల్యే/ ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికారిక గుర్తింపు పత్రం
11) ఆధార్ కార్డు
ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించేవారికే ఓటు వేయడానికి పోలింగ్ అధికారి అనుమతిస్తారు.
ఈ విషయాన్ని ఓటర్లు అందరూ గుర్తించాలని ఎన్నికల సంఘం కోరింది.